రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించింది. ‘మూడు రాజధానులు’ తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకూ సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో శనివారం ఆ పార్టీ ముఖ్య నేతలు (కోర్ కమిటీ సభ్యులు) సమావేశమయ్యారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ దేవధర్, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… రాజ్భవన్, సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, సీడ్ క్యాపిటల్ ఇలా ఏపీకి ముఖ్య పాలనా కేంద్రంగా అమరావతే ఉండాలని సమావేశంలో తీర్మానించారు. అమరావతిపై పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడకూడదనే అంశంపైనా చర్చించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ కన్నా చేస్తున్న ప్రకటనే పార్టీ విధానంగా ఉండాలని సుజనా సూచించారు. దీనికి సీఎం రమేశ్, పురందేశ్వరి తదితరులు మద్దతు పలికారు. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని, తటస్థంగా ఉంటే సరిపోతుందని జీవీఎల్ అన్నట్లు తెలిసింది.