Notice to Sujana Chowdary: పార్టీ మారినా ఫలితం దక్కలేదు.. పాపం సుజనా!

మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి కాలం కలిసి రావడం లేదు. అధికారపార్టీలో వుంటే అండాదండా వుంటుందనుకున్న సుజనాచౌదరి కలలు కల్లలయ్యాయి.

Notice to Sujana Chowdary: పార్టీ మారినా ఫలితం దక్కలేదు.. పాపం సుజనా!

Edited By:

Updated on: Feb 25, 2020 | 5:34 PM

BJP MP Sujana Chowdary in bank fraud case: మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి కాలం కలిసి రావడం లేదు. అధికారపార్టీలో వుంటే అండాదండా వుంటుందనుకున్న సుజనాచౌదరి కలలు కల్లలయ్యాయి. టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరుగాంచిన సుజనా చౌదరి తన మిత్ర బంధాన్ని కూడా కాదనుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. బ్యాంకుల నుంచి నోటీసులు ఆగడం లేదు. రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో ఆస్తుల వేలం దాకా పరిస్థితి వచ్చిందంటే ఆయన టైమ్ బాగాలేకపోవడమేనని చెప్పుకుంటున్నారు.

కార్పొరేట్లు పొలిటీషియన్లుగా మారుతున్న జమానా ఇది. దాంతో రెండు దశాబ్దాల క్రితమే టీడీపీకి సన్నిహితంగా మారిన సుజనా చౌదరి అనతికాలంలోనే చంద్రబాబుకు దగ్గరయ్యారు. అదే క్రమంలో రెండు విడతలుగా రాజ్యసభ సభ్యత్వం పొందారు. 2014లో ఏర్పాటైన మోదీ-01 ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబు వ్యూహం మార్చి బీజేపీకి దూరమయ్యే దాకా సుజనా కేంద్రంలో మంత్రిగా కొనసాగారు.

అయితే, 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరపరాజయం పాలవడం.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం టీడీపీపై ప్రతీకారం తీర్చుకునే దిశగా సాగే పరిస్థితి కనిపించడంతో ఏకంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని చీల్చి మరీ బీజేపీ పంచన చేరారు సుజనా చౌదరి. ఆయనతోపాటు గరికపాటి మోహన్ రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ కూడా బీజేపీలో విలీనమయ్యారు. ఇక్కడి దాకా కథ బాగానే వున్నా.. ఇటీవల కాలంలో సుజనాకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ గతంలో తీసుకున్న సుమారు 400 కోట్ల రూపాయల రుణం తాలూకు బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో ఆ రుణం తీసుకున్నప్పుడు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దమైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేట్ బ్రాంచి పేరిట వచ్చిన నోటీసుతో సుజనా తీసుకున్న రుణానికి గ్యారెంటీ ఇచ్చిన వారికి షాక్ తగిలినట్లయ్యింది. ముగ్గురు గ్యారెంటీర్లతోపాటు.. సుజనాకు చెందిన మరిన్ని కంపెనీల పేర్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నోటీసులో ప్రస్తావించింది.

బ్యాంకులు తనపట్ల కఠినంగా వ్యవహరించకుండా వుండేందుకే సుజనా బీజేపీలో చేరారని గతంలో ప్రచారం జరిగింది. అయితే.. అప్పట్లోనే బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు పార్టీ మారినంత మాత్రాన విచారణల నుంచి తప్పించుకోలేరంటూ కామెంట్ చేసి, సుజనాకు బీజేపీలో చేరినా ఊరట కష్టమేనన్న సంకేతమిచ్చారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసుతో సుజనాకు క్లారిటీ వచ్చి వుంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. మార్చి 23వ తేదీన ఆస్తుల వేలం జరగనుండగా.. ఎంతో కొంత మొత్తం బ్యాంకుకు చెల్లించడం ద్వారా వేలం నుంచి తప్పించుకునే వెలుసుబాటు సుజనాకు వుండడం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us