పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీలో జగన్ ప్రభుత్వం మెగా సమ్మిట్ ను నిర్వహించనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం, సహకారంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ కాన్ఫరెన్స్ జరగనుంది. కనీసం 30 నుంచి 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరల్స్, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఇది రెండు దశలుగా సాగనుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తొలి దశలో సీఎం జగన్.. ఆయా దేశాల రాయబారులు, కాన్సులేట్ జనరల్స్ తో సమావేశమవుతారు. రెండో దశలో వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయి..రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామిక రంగ అభివృధ్దికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాల పెంపునకు చేస్తున్న కృషిని కూడా ఆయన తెలియజేస్తారు. గ్రామ వాలంటీర్లు, వార్డు సెక్రటరీల నియామకం ద్వారా 4. 01 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని కూడా నిర్ణయించింది. ఈ దిశగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ఇదిలా ఉండగా.. అనంతపురం జిల్లా పెనుకొండలో కియా మోటార్స్ కంపెనీ తమ కొత్త కారును ఆగస్టు 8 న లాంచ్ చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ను ఆ సంస్థ ఆహ్వానించింది.