Jagananna Vidya Kanuka: ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఆయన విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారీ బడుల రూపు రేఖలను మార్చి ఏపీ ప్రభుత్వం నూతన విద్యా ఒరవడికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పధకాలతో పాటుగా, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు, నాడు-నేడు లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావసతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా సర్కారీ బడులలో ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోంది.
ఇదిలా ఉంటే పాఠశాలలు పునః ప్రారంభమైన మొదటి రోజే ప్రతీ విద్యార్ధికి జగనన్న విద్యాకానుక అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. విద్యా కానుక కిట్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతీ విద్యార్ధికి మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్,నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు నోట్ బుక్స్ చేరుకోగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి నోట్బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కూడిన కిట్ను విద్యార్ధులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.
Also Read: కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..