నేడు కొలిక్కి రానున్న అంతర్రాష్ట్ర ఒప్పందం
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. దసరాకు ముందే అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారు కావాల్సి ఉండగా, టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులో లేనందున వాయిదా పడింది...
సందిగ్ధంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా రవాణ వ్యవస్థ ఈ రోజు ఫైనల్ కానుంది. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. దసరాకు ముందే అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారు కావాల్సి ఉండగా, టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులో లేనందున వాయిదా పడింది. దీంతో తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వరకు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ సరిహద్దు వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్ని నడిపింది.
అయితే ఈ చర్చలు ఫలిస్తే.. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఇదిలావుంటే… రెండు రాష్ట్రాల సరిహద్దుల వరకు మాత్రమే బస్సులు నడిచాయి, వీటిని దసరా ట్రిప్పుల పేరుతో ప్రజా రవాణ వ్యవస్థ నడిచింది. ఇందులో… టీఎస్ఆర్టీసీ.. కర్నూలు సరిహద్దు పంచలింగాల వరకు ఎక్కువగా బస్సుల్ని తిప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ కేవలం 15 బస్సుల్ని మాత్రమే తిప్పగా, టీఎస్ఆర్టీసీ 211 బస్సుల్ని నడిపింది.
గరికపాడు, వాడపల్లి, ఓహ్లాన్, కల్లుగూడెం, జీలుగుమిల్లి, పంచలింగాల, ఎంఎస్వీ పాలెం, పలకలగూడెం చెక్పోస్టుల వద్ద నుంచి ఏపీఎస్ఆర్టీసీ 11,255 మందిని, టీఎస్ఆర్టీసీ 6,828 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది. అయితే ఈ రోజు జరుగుతున్న చర్చలు ఫలించే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు అంటున్నాయి.