
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్, మైక్ పాంపియోలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం కలుసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే బదులు.. వీరు ‘ఎల్బో బంప్’ (మోచేతుల కరచాలనం) తో తమ భేటీ అయిందనిపించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో సుమారు 40 నిముషాలసేపు వీరి సమావేశం జరిగింది. టూ ప్లస్ టూ మూడో విడత మినిస్టీరియల్ సమావేశానికి ముందు జరిగిన ఈ సమావేశంలో.. భారత, అమెరికా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపుదలకు తీసుకోవలసిన చర్యలమీద, లడాఖ్ లో చైనా ఆక్రమణ మీద ప్రధానంగా చర్చించారు.