కేంద్రానికి మండలి రద్దు తీర్మానం..నెక్ట్సేంటి..?

మండలి రద్దు రాజకీయం ఢిల్లీ చేరింది. పార్టీలన్నీ ఇప్పుడు అక్కడే మోహరించబోతున్నాయి. తీర్మానాన్ని కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. ఇల్లు అలకగానే పండగ కాదంటోంది టీడీపీ. అటు జాతీయ పార్టీలు వైఖరి ఏంటో క్లారిటీ రావాలి. ఇంతకీ మండలి రద్దు అంశంలో ఢిల్లీలో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ ఏంటి? ఆర్టికల్‌ 169(1) లో ప్రకారం కౌన్సిల్‌ను రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ప్రభుత్వం. ఈ కాపీ అందుకున్న హోంశాఖ ప్రక్రియను మొదలుపెడుతుందా? లేదా […]

కేంద్రానికి మండలి రద్దు తీర్మానం..నెక్ట్సేంటి..?

Updated on: Jan 28, 2020 | 9:57 PM

మండలి రద్దు రాజకీయం ఢిల్లీ చేరింది. పార్టీలన్నీ ఇప్పుడు అక్కడే మోహరించబోతున్నాయి. తీర్మానాన్ని కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. ఇల్లు అలకగానే పండగ కాదంటోంది టీడీపీ. అటు జాతీయ పార్టీలు వైఖరి ఏంటో క్లారిటీ రావాలి. ఇంతకీ మండలి రద్దు అంశంలో ఢిల్లీలో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌ ఏంటి?

ఆర్టికల్‌ 169(1) లో ప్రకారం కౌన్సిల్‌ను రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ప్రభుత్వం. ఈ కాపీ అందుకున్న హోంశాఖ ప్రక్రియను మొదలుపెడుతుందా? లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం బడ్జెట్‌ బిజీతో పాటు.. పలు కీలక బిల్లులు సిద్దం చేస్తున్న కేంద్రం…అందులో ఏపీ కౌన్సిల్‌ బిల్లును కూడా చేర్చుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. శుక్రవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కూడా ఉండడంతో ఏపీ రాజకీయాలు హస్తినకు మారాయి. కౌన్సిల్‌ రద్దుకు అసెంబ్లీ వేదికగా కారణాలు చెప్పిన వైసీపీ.. ఢిల్లీలో లాబీయింగ్‌ మొదలుపెట్టింది. రాజ్యాంగబద్దంగానే కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేశామని… బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంట్‌‌కు వస్తుందని చెబుతున్నారు వైసీపీ నేతలు.

మండలి రద్దు వెంటనే కాదంటున్నారు టీడీపీ నేతలు. చట్టబద్దమైన, సహేతుకమైన కారణాలు చూపించాలని వాదిస్తున్నారు. తాజా నిర్ణయంలో రాజకీయ కుట్ర ఉందని.. ఇది న్యాయసమీక్షలో నిలబడదని చెప్పారు టీడీపీ ఎంపీలు. రాజస్తాన్‌, అసోం, తమిళనాడు నుంచి వచ్చిన తీర్మానాలను రాజ్యసభ స్టాండింగ్‌ కమిటీకి రిఫర్‌ చేసిందని, గతంలో జరిగిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలించి దీన్ని కూడా రిఫర్‌ చేయడానికి ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారా అంటే మాత్రం… పార్లమెంటులో చర్చకు వస్తే.. అప్పుడు పార్టీలో చర్చించి తమ విధానం చెబుతామన్నారు కనకమేడల.

మరోవైపు మండలి రద్దు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. అదే సమయంలో రాష్ట్రం పంపిన తీర్మానం పార్లమెంటులో పెట్టడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు తమ విధానం చెబుతామంటోంది. రాజ్యసభలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల మద్దతు కీలకం. లెఫ్ట్‌ పార్టీలు కూడా మండలి రద్దును వ్యతిరేకించడం లేదు. కాకపోతే.. నిర్ణయం తీసుకున్న తీరుపైనే అభ్యంతరం చెబుతున్నారు. ప్రభుత్వపరంగా తీర్మానం కేంద్రానికి చేరింది. ఇక రాజకీయ అడ్డంకులకు అధిగమించుకుని… బిల్లుగా మారుతుందా అన్నది చూడాలి.