రామతీర్థ పోరుకు నలుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన పవన్ కళ్యాణ్, సత్వర న్యాయంకోసం బీజేపీతో కలిసి పోరుబాట
రామతీర్థం దేవాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి పార్టీ తరపున పోరాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు...

రామతీర్థం దేవాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి పార్టీ తరపున పోరాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘుని పవన్ కళ్యాణ్ నియమించారు. రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గుడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని ఈ సందర్భంగా జనసేన విమర్శించింది. ఈ కేసులో సత్వర న్యాయం జరిగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పింది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని పార్టీ ప్రకటనలో పేర్కొంది.