
చెట్ల మొదళ్లకు తెల్ల రంగు పూయడం భారతదేశంలో, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వసాధారణమైన దృశ్యం. రోడ్ల పక్కన, తోటల్లో, పార్కుల్లో కనిపించే ఈ రంగుకు అనేక శాస్త్రీయ, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పద్ధతి చెట్లను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నిపుణులు ఈ పద్ధతి వెనుక ఉన్న కారణాలను వివరించారు. మామిడి వంటి చెట్లకు తరచుగా చెదలు, చీమలు, ఇతర కీటకాల వల్ల నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించడానికి సున్నం.. కొన్నిసార్లు గేమార్జెన్ పౌడర్ను కలిపి చెట్ల మొదళ్లకు వేస్తారు. సున్నం, రసాయనికంగా కాల్షియం కార్బోనేట్, ఒక శక్తివంతమైన కీటకనాశినిగా పనిచేస్తుంది. ఇది క్రిమి కీటకాలు, చెదలుచ శిలీంధ్రాల (fungal infections) వ్యాప్తిని నిరోధించి, చెట్లను రక్షిస్తుంది. కీటకాలు సాధారణంగా చెట్టు బెరడు లోపలికి చొచ్చుకుపోయి, అక్కడి నాలాల నుంచి ద్రవపదార్థాలను పీల్చుకోవడం ద్వారా చెట్టుకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. సున్నం పూత ఈ బెరడును సంరక్షించి, చెట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
సున్నం పూతను ఎలా వేయాలంటే, సున్నాన్ని బకెట్లో తగినంత నీటితో కలిపి చిక్కటి ద్రావణాన్ని తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని చెట్టు మొదళ్లకు మందంగా పూయాలి. ఇలా మందంగా వేసిన పూత సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల వరకు ప్రభావవంతంగా ఉంటుంది. సంవత్సరానికి రెండుసార్లు, అంటే ఆరు నెలలకొకసారి ఈ పూతను వేయడం వల్ల చెట్టును ఏడాది పొడవునా సంరక్షించవచ్చు. ఒక చెట్టుకు సుమారు 100 నుండి 200 గ్రాముల సున్నం అవసరం అవుతుంది.
పూర్వకాలంలో బోడా మిక్చర్ (కాపర్ సల్ఫేట్, సున్నం సమపాళ్లలో కలిపిన మిశ్రమం) గురించి తెలియకపోయినా, రైతులు కేవలం సున్నాన్ని మాత్రమే ఉపయోగించేవారు. సున్నం యాంటీ-ఇన్సెక్టిసైడ్గా పనిచేయడం అనేది ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం. రైతులు సున్నంతో పాటు మరికొన్ని పద్ధతులను కూడా అనుసరిస్తారు. ఉదాహరణకు, కొన్ని చోట్ల చెట్టు మొదలుకు ముందుగా తారు వేసి, దానిపై సున్నం పూత వేస్తారు. తారు వేయడం వల్ల కీటకాలు, పురుగులు చెట్టుపైకి పాకడానికి పట్టు దొరకక జారిపడిపోతాయి, ఇది కీటక నియంత్రణలో 100% ప్రభావవంతంగా ఉంటుందని రైతులు నమ్ముతారు. పంట తీసిన తర్వాత ఒకసారి, పూతకు వచ్చే ముందు మరోసారి సున్నం వేయడం వల్ల ఏడాది పొడవునా చెట్టు సంరక్షణ పూర్తి అవుతుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి కాబట్టి అనేక మంది రైతులు దీన్ని పాటిస్తారు.
ప్రభుత్వ సంస్థలు కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లకు సున్నం వేస్తుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా మార్కింగ్ కోసం ఈ రంగును ఉపయోగిస్తారు, తద్వారా రాత్రి వేళల్లో వాహనదారులకు చెట్లు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, ఈ పద్ధతి చెట్లను చెదల నుంచి రక్షించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి, చెట్ల మొదళ్లకు తెల్ల రంగు పూయడం అనేది కేవలం ఒక సంప్రదాయ పద్ధతి మాత్రమే కాకుండా, చెట్ల ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పాదకత, రహదారి భద్రతకు దోహదపడే ఒక శాస్త్రీయ పరిష్కారం.
చాలా రకాలుగా మిల్క్ కల్తీ..? కల్తీ పాలను ఇంటి వద్దనే ఎలా గుర్తించాలంటే