యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం.. మరో వందేళ్ల వరకు..

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం మానవ ప్రాణాలనే కాదు, భూమాతను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. క్షిపణులు, బాంబులు, రసాయన ఆయుధాల వాడకం వల్ల గాలి, నీరు, నేల విషతుల్యమవుతున్నాయి. అడవులు కాలిపోతున్నాయి, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ఈ యుద్ధం పర్యావరణానికి పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తూ భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా మారుతోంది. ఈ పర్యావరణ నష్టాన్ని పూడ్చడానికి ..

యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం.. మరో వందేళ్ల వరకు..
West Asia Conflict

Updated on: Mar 13, 2026 | 3:54 PM

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు కేవలం మనుషుల ప్రాణాలనే కాదు, భూమాత గర్భాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు ఉన్న గ్రూపుల మధ్య జరుగుతున్న ఈ భీకర సంఘర్షణ ఇప్పుడు కేవలం సరిహద్దుల మధ్య పోరాటంగా మిగిలిపోలేదు. ఇది పర్యావరణంపై జరుగుతున్న అప్రకటిత దాడిగా మారింది. దీని పర్యవసానాలు సుదూరంగా, దీర్ఘకాలికంగా ఉంటాయి. యుద్ధంలో ఉపయోగించే క్షిపణుల గర్జన, బాంబుల పేలుళ్లు, రసాయన ఆయుధాల వాడకం గాలి, నీరు, మట్టిని విషపూరితం చేస్తున్నాయి. యుద్ధపు వేడికి అడవులు కాలిపోవడం, సముద్రాలు కలుషితమవడం, విషవాయువుల విడుదల భవిష్యత్ తరాలకు కేవలం బూడిదను మాత్రమే మిగులుస్తాయా అనే ఆందోళన పెరుగుతోంది. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులు, ఇరాన్ ప్రయోగిస్తున్న వందలాది క్షిపణులు కేవలం భవనాలను కూల్చడమే కాకుండా, వాతావరణంలోకి టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికరమైన వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇది ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు గణనీయంగా దోహదపడుతోంది.

యుద్ధం పర్యావరణంపై చూపుతున్న ప్రధాన ప్రభావాలను పరిశీలిస్తే, ఇజ్రాయెల్ వాడుతున్న తెల్ల భాస్వరం (వైట్ భాస్వరం) కేవలం మానవ చర్మాన్నే కాదు, నేల సారాన్ని కూడా కాల్చేస్తోంది. ఇది దశాబ్దాల పాటు మట్టిలో ఉండిపోయి వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది. నిరంతర క్షిపణి దాడులు, చమురు డిపోలపై పేలుళ్ల కారణంగా పశ్చిమాసియా ఆకాశం మొత్తం నల్లటి పొగతో నిండిపోయింది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి విష వాయువులు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఈ యుద్ధం కారణంగా విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లో, సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల సముద్ర జీవులు నశించిపోతున్నాయి. త్రాగునీరు కూడా విషపూరితం అవుతోంది. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతంలోని వేలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది, దీనివల్ల అరుదైన వన్యప్రాణులు, పక్షి జాతులు వినాశనం అంచుకు చేరుకున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం, గత కొన్ని నెలలుగా జరిగిన యుద్ధం వల్ల ఏర్పడిన పర్యావరణ నష్టాన్ని సరిదిద్దాలంటే కనీసం 50 నుండి 100 సంవత్సరాలు పడుతుంది. భూమి, అటవీ ప్రాంతాలు, సముద్రం, వాయువులు అన్నీ ఈ స్థాయిలో నష్టపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

యుద్ధంలో వాడే పేలుడు పదార్థాలలో ఉండే సీసం (లెడ్), పాదరసం (మెర్క్యురీ) వంటి భార లోహాలు నేలను శాశ్వతంగా నిస్సారంగా మారుస్తున్నాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై నిరంతర దాడులు జరుగుతున్నాయి. ఒకవేళ చమురు లీక్ అయితే అది ఆ ప్రాంతంలోని మొత్తం పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. ఇప్పటికే యుద్ధభూమిలో వేలాది టన్నుల ఘన వ్యర్థాలు, భవన శిధిలాల రాశులు పేరుకుపోయాయి. ఈ శిధిలాలలో ఉండే ఆస్బెస్టాస్, ఇతర ప్రమాదకరమైన పదార్థాలు ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలను చూపుతాయి.  ప్రపంచ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఈ పర్యావరణ మారణహోమాన్ని ఆపకపోతే, రాబోయే రోజుల్లో మానవజాతి బ్రతకడానికి భూమి కూడా మిగలదేమో అనే భయం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ విశ్లేషకులు, శాస్త్రవేత్తలు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us