
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల మధ్య నడిచే ఒక రైలు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక వింతగా నిలిచిపోయింది. 1948 నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాది మందికి సేవలు అందిస్తున్న ఈ రైలు.. కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఒక జీవన వారసత్వం. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ ఉచిత రైలు ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అది ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? వంటి విశేషాలు తెలుసుకుందాం..
రైలు ప్రయాణం అంటేనే టికెట్ ఖర్చులతో కూడుకున్నది అని మనం భావిస్తాం. కానీ పంజాబ్లోని నంగల్ నుండి హిమాచల్ ప్రదేశ్లోని భాక్రా వరకు సాగే 13 కిలోమీటర్ల రైలు ప్రయాణం మాత్రం పూర్తిగా ఉచితం.
చారిత్రక నేపథ్యం: ఈ రైలు సర్వీస్ 1948లో ప్రారంభమైంది. అప్పట్లో ఆసియాలోనే అత్యంత ఎత్తైన డ్యామ్లలో ఒకటైన ‘భాక్రా-నంగల్ డ్యామ్’ నిర్మాణ పనుల కోసం కార్మికులను, ఇంజనీర్లను, నిర్మాణ సామాగ్రిని తరలించడానికి ఈ రైలును ప్రవేశపెట్టారు. అప్పటి నుండి నేటి వరకు ఈ రైలు తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. 1953లో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజిన్లను దీనికి అమర్చారు.
ఎందుకు ఉచితం? ఈ రైలు నిర్వహణ బాధ్యతను ‘భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్’ (BBMB) చూసుకుంటుంది. గంటకు 18 నుండి 20 లీటర్ల ఇంధనం ఖర్చవుతున్నప్పటికీ.. ఈ ప్రాంత ప్రజల పట్ల గౌరవంతో, డ్యామ్ నిర్మాణంలో భాగస్వాములైన వారి జ్ఞాపకార్థం ఈ ప్రయాణాన్ని ఉచితంగానే కొనసాగిస్తున్నారు. ఈ రైలులో ప్రతిరోజూ సుమారు 800 మంది ప్రయాణిస్తుంటారు.
పర్యాటక ఆకర్షణ: శివాలిక్ కొండల మధ్య, సట్లెజ్ నదిపై నిర్మించిన వంతెనల మీదగా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతినిస్తుంది. విలాసవంతమైన సౌకర్యాలు లేకపోయినా.. ఇందులో ఉండే చెక్క సీట్లు, పాతకాలపు బోగీలు మనల్ని గత చరిత్రలోకి తీసుకెళ్తాయి. ప్రభుత్వాలు మారినా, రైల్వే వ్యవస్థలో ఆధునిక మార్పులు వచ్చినా.. ఈ ఒక్క సర్వీస్ మాత్రం మార్పు లేకుండా అలాగే కొనసాగడం విశేషం.