నమ్మకం ఉండాలి గానీ మరీ ఇంతా.. ఇలాంటి షాపులున్నాయని తెలిస్తే షాక్ అవుతారు..!
జేబుకు తెలీకుండా పర్సులు కొట్టేసే రోజులివి. కానీ, భారత్ లోని ఓ గ్రామం మాత్రం నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారింది. అసలిక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ గ్రామంలో కిరాణ షాపుల దగ్గరినుంచి కూరగాయల కొట్టు వరకు ఎక్కడా షాపులకు యజమానులే ఉండరు. వీటిని ఎన్ఘ లౌర్ దార్.. అంటే యజమానులు ఉండని షాపులు అని పిలుస్తారు.

మిజోరంలోని సెలింగ్ లో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. నచ్చింది తీసుకుని డబ్బులు అక్కడున్న కౌంటర్లో వేసి వెళ్తారు. షాపులో దొరికే వస్తువుల లిస్టు బయట ఒక బోర్డులో రాసి పెట్టి ఉంటుంది. మరి వీరంతా షాపులు వదిలేసి ఎక్కడికెళ్తారు అని సందేహం వచ్చిందా? అవును వారంతా షాపులు తెరిచి పొద్దున్నే తమ తమ పనులకు వెళ్లిపోతారు. కొందరు కూలి పనులకు మరి కొందరు స్థానికంగా దొరికే పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు.
కరోనా మార్చింది అందరినీ..
ఈ ఊరి వారు పాటిస్తున్న ఈ పద్దతి గతంలో ఎప్పుడూ ఇక్కడ లేదు. కానీ కరోనా కాలం ఒక్కసారిగా వీళ్లందరి జీవితాలను మార్చేసింది. రైతులంతా లాక్ డౌన్ సమయంలో విపరీతమైన నష్టాలను చూశారు. దీంతో వారు పండించిన వాటిని ఇలా షాపుల్లో ఉంచేసి పనికి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. కేవలం మనుషులపై ఉండే నమ్మకం, ఒకరినొకరు మోసం చేసుకోని మానవత్వమే వీరిని ఇలాంటి పనికి పూనుకునేలా చేసింది. అయితే, ఊరిలోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారికి తమ గ్రామం పరిస్థితిని అర్థమయ్యేలా ఒక బోర్డు మీద రాసి పెడతారట. వారు కూడా గ్రామస్థులకు సహకరిస్తుంటారని ఇక్కడి వారు చెప్తారు.
దొంగతనాలే జరగని గ్రామం..
వారే ఎవరికి ఎవరూ కాని ఈ రోజుల్లో ఒక గ్రామమంతా కలిసి ఇలా నిజాయితీతో మెలగడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆ రోజంతా కౌంటర్ లో జమైన మొత్తాన్ని యజమానులు సాయంత్రానికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారట. నిజంగా ఇది ఆదర్శ గ్రామమే అని దీని గురించి తెలిసిన వారంతా అనుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క దొంగతనం కూడా నమోదు కాకపోవడం మరో ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు.