వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఎలాంటి పంట సాగు చేయాలి..?

నైరుతి రుతుపవనాలు విస్తరిస్తూ వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. అయితే నేల స్వభావం, నీటి లభ్యత, విత్తే సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పంటలు సాగు చేయడం వల్ల ప్రతి ఏడాది అనేక మంది రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నేల రకాన్ని బట్టి ఏ పంటలు సాగు చేయాలి, ఎప్పుడు విత్తాలి, ఏ రకాలను ఎంచుకోవాలి అనే అంశాలపై వ్యవసాయ నిపుణులు కీలక సూచనలు చేశారు.

వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఎలాంటి పంట సాగు చేయాలి..?
Kharif Season Begins In Telangana

Updated on: Jun 10, 2026 | 8:47 PM

ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటం.. వానలు కురుస్తుండటంతో రైతులు సాగు పనులలో నిమగ్నమయ్యారు. అయితే, ఏ పంటను ఎప్పుడు వేయాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. భూమిని, విత్తే సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సాగు చేయడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించడానికి నేల స్వభావం, నీటి లభ్యత, విత్తే సమయాన్ని బట్టి పంటల ఎంపిక చేసుకోవడం అత్యంత కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం నిపుణులు చెబుతున్నారు.

నేల స్వభావం ఆధారంగా పంటల ఎంపిక:

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 65% ఎర్ర నేలలు, 25% నల్లరేగడి నేలలు ఉన్నాయి.

ఎర్ర నేలలు: మెరక ప్రాంతాల్లో, వర్షాధారంగా పంటలు పండించాలనుకున్నప్పుడు కంది, పత్తి, ఆముదం, పెసర, మినుము లాంటి పంటలు ఎంచుకోవాలి. కాలువల కింద లోతట్టు ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉన్న ఎర్ర నేలల్లో వరి పంటను సాగు చేయవచ్చు. నీటి సౌకర్యం ఆలస్యంగా అందుబాటులోకి వస్తే, ముందుగా పెసర్లు, మినుములు వంటి తక్కువ కాల వ్యవధి గల పంటలు వేసుకొని, అధిక వర్షాలు కురిస్తే వాటిని పచ్చిరొట్టగా కలియదున్నుకొని వరి పంటకు మారవచ్చు.

నల్లరేగడి నేలలు: నీటి లభ్యత ఉండి, లోతట్టు ప్రాంతాలు అయితే వరిపంటకు అనుకూలం. మెరక ప్రాంతపు నల్లరేగడి భూముల్లో పత్తి, కంది పంటలను వేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్నప్పుడు మొక్కజొన్న పంట కూడా సాగు చేయవచ్చు.

విత్తే సమయం – పంటల రకాలు:

సరైన సమయంలో పంటలు విత్తడం దిగుబడిని ప్రభావితం చేస్తుంది.

పత్తి: తొలకరి వర్షాలు కురిసిన తర్వాత, జూన్ 15 నుండి జూలై మొదటి వారం వరకు విత్తవచ్చు. జూలై మొదటి వారం దాటితే దిగుబడులు తగ్గుతాయి.

కంది: జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. జూలై 20 తర్వాత విత్తినట్లయితే దిగుబడులు తగ్గుతాయి.

పెసర, మినుము: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఇవి 65-70 రోజుల్లో పంటకాలం కలిగిన స్వల్పకాలిక రకాలు, త్వరగా ఆదాయాన్ని అందిస్తాయి.

జొన్న: జూలై 15 వరకు లేదా జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. తెల్లజొన్న, పచ్చజొన్న రకాలు అందుబాటులో ఉన్నాయి.

మొక్కజొన్న: తప్పనిసరిగా నీటి సౌకర్యం అందుబాటులో ఉంటేనే విత్తుకోవాలి, వర్షాధారంగా వేయకూడదు.

వరి:

దీర్ఘకాలిక రకాలు (B.P.T 5204 వంటివి) ఇప్పటికే నారు పోసి ఉండాలి. ఇప్పుడు నారు పోయడం వల్ల నీటి వినియోగం ఎక్కువ, తెగుళ్లు వచ్చే అవకాశం అధికం కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలిక రకాలను ఎంచుకోకపోవడమే ఉత్తమం. స్వల్పకాలిక సన్నగింజ రకాలు జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో నారు పోసుకొని పండించుకోవచ్చు. దొడ్డుగింజ రకాలు జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో నారు పోసుకొని పండించుకునే అవకాశం ఉంది.

పంటల రకాల ఎంపిక:

రైతులు తమ అవసరాలకు, నేలలకు అనుగుణంగా సరైన రకాలను ఎంచుకోవాలి.

రైతులు తమ ప్రాంతంలో లభించే నీటి లభ్యత, విత్తే సమయం, నేల స్వభావాన్ని బట్టి సరైన పంటలను, వాటి రకాలను ఎంచుకోవడం ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించి లాభాలను పొందవచ్చు..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us