
మల్లెపూల సీజన్ మొదలైంది.. చాలా మంది ఇళ్లల్లో మల్లెపూల తీగలు ఉంటాయి.. మార్చి నుంచి జూన్ వరకు మల్లెపూలు ఎక్కువగా కాస్తాయి.. అయితే, మల్లెపూలు విరివిగా పూయాలంటే, ఇంటి వద్దే సులభంగా తయారు చేసుకోగల బీట్రూట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ద్రావణ ఎరువుతో కేవలం మల్లె మొక్కలే కాకుండా ఇతర పూల మొక్కలు, చిన్న మొక్కలు, పండ్ల మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి, పుష్కలంగా పూలను, కాయలను అందిస్తాయి. ఈ పద్ధతికి ఎటువంటి ఖర్చు ఉండదు.
మల్లె మొక్కలు గుత్తులుగా, విపరీతంగా పూయాలంటే కొన్ని పద్దతులను అనుసరించాలి.. ముందుగా.. పాత/ఎండిన కొమ్మలను కత్తిరించడం, సూర్యరశ్మి తగిలేలా చూడటం, ఎరువు వేయడం, నేలలో తేమ ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. మల్లెపూలు విరగకాయాలంటే.. మరో చిట్కాను కూడా అనుసరించాలి.. లిక్విడ్ ఫెర్టిలైజర్ తో మల్లెపూలు భారీగా పూస్తాయని పేర్కొంటున్నారు.
లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారీ విధానం:
ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ను రెండు పద్ధతులలో తయారు చేసుకోవచ్చు.
బీట్రూట్ను కూర వండడానికి తొక్క తీసినప్పుడు, దాని పై తొక్కులను పడేయకుండా సేకరించాలి. సుమారు పావు కేజీ బీట్రూట్ల తొక్కులను (సుమారు మూడు బీట్రూట్ల నుంచి వచ్చేవి) మూడు లీటర్ల నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టాలి. రెండు రోజులు గడిచేసరికి, బీట్రూట్ తొక్కులు నీటిలో పూర్తిగా కరిగిపోయి, నీరు చిక్కటి ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని ఫిల్టర్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ ద్రావణం మొక్కలకు కావలసిన బీటా-కెరోటిన్, విటమిన్లు, మైక్రోన్యూట్రియెంట్స్ను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది మొక్కలకు సహజమైన పోషకాలను అందిస్తుంది.
ఒకవేళ మీరు తొక్కులు సేకరించలేకపోతే, కూర వండడానికి ముందు బీట్రూట్ను రాత్రంతా నీటిలో నానబెట్టవచ్చు. ఉదాహరణకు, మధ్యాహ్నం కూర వండాలనుకుంటే, ఉదయం బీట్రూట్ను నీటిలో వేసి ఉంచాలి. ఆటోమేటిక్గా నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. తర్వాత బీట్రూట్ను తీసి కూర వండుకోవచ్చు. ఈ విధంగా తయారైన ఎరుపు నీటిని కూడా మొక్కలకు ద్రావణ ఎరువుగా ఉపయోగించవచ్చు.
ఈ శక్తివంతమైన ద్రావణ ఎరువును వివిధ రకాల మొక్కలకు తగిన మోతాదులో అందించవచ్చు:
* మల్లె పువ్వు మొక్కలకు: వారానికి ఒక గ్లాసు చొప్పున ఇస్తే అవి విరివిగా పూలను పూస్తాయి.
* చిన్న మొక్కలకు: అర గ్లాసు ద్రావణం సరిపోతుంది.
* పెద్ద పండ్ల మొక్కలకు: ఒక మగ్గు (సుమారు ఒక లీటరు) వరకు ఇవ్వవచ్చు.
ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలను చాలా బుషీగా పెరిగేలా చేస్తుంది. మొక్కలు చాలా ఆరోగ్యంగా, పచ్చగా మారతాయి. ఉదాహరణకు, ఈ ద్రావణ ఎరువు ఇవ్వకముందు ఆకులు ఎండిపోయి నీరసంగా ఉన్న తులసి మొక్క, రెండుసార్లు ఈ ద్రావణాన్ని ఇవ్వడం ద్వారా పచ్చగా, ఆరోగ్యంగా మారినట్లు గమనించబడింది. ఈ పద్ధతి ఖర్చులేనిది – సహజమైనది. ఇంటి తోటపని చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మొక్కలకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ను అందించి, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..