Voter ID Online: ఎన్నికల నగారా..ఓటరు కార్డు ఇలా అప్లై చేయండి.. 15 రోజుల్లోనే ఇంటికి!

స్థానిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, ఓటర్లకు ఇది కీలక అప్‌డేట్. ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారికి, ఓటరు గుర్తింపు కార్డు దరఖాస్తు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. 18 ఏళ్లు నిండిన యువత ఇకపై తమ ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, పాత కార్డులలో మార్పులు, చేర్పులు సైతం సులువుగా చేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది, ఏయే పత్రాలు అవసరం, ఎంత వేగంగా కార్డు పొందవచ్చో పూర్తి వివరాలు కింద చూడండి.

Voter ID Online: ఎన్నికల నగారా..ఓటరు కార్డు ఇలా అప్లై చేయండి.. 15 రోజుల్లోనే ఇంటికి!
Apply Voter Id Online

Updated on: Jun 30, 2025 | 4:45 PM

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓటర్లకు శుభవార్త. ఓటరు కార్డు దరఖాస్తు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇకపై ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండిన వారు, అలాగే ఇప్పటికే ఓటరు కార్డులో తప్పులు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు, సవరణలు చేయించుకోవచ్చు.

15 రోజుల్లోనే ఓటరు కార్డు

ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) పేరుతో నూతన వెబ్‌సైట్‌లో కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు, మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలు కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాల ప్రకారం, కేవలం 15 రోజుల్లోనే ఈపీఐసీ కార్డులు చేతికి అందుతాయి. పోలింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ సంస్కరణలు చేపట్టింది. యువతను ఆకర్షించేలా వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం

ముందుగా ఎన్వీఎస్పీ (NVSP) వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మీ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీతో సైన్ అప్ చేయండి.

ఆ తర్వాత పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.

కొత్తగా నమోదు చేసుకునేవారు ఫారం-6లో వివరాలు నమోదు చేయాలి.

అక్కడ అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

రియల్ టైమ్ ట్రాకింగ్

దరఖాస్తు స్థితిని కూడా ఇదే పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. దీనికోసం మీ ఫోన్ నంబర్, క్యాప్చా, ఓటీపీ నమోదు చేయాలి. దరఖాస్తు చేసినప్పుడు వచ్చిన మెసేజ్‌లోని సంఖ్యను నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది. ఓటర్ ఐడీ కార్డుల పంపిణీకి సాధారణంగా 30 రోజులకు పైగా సమయం పడుతుంది. అయితే, ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులు చెబుతున్నారు. కొత్త విధానంలో ఓటరు కార్డు తయారవడం నుంచి ఓటరుకు అందేవరకు ప్రతి దశనూ పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ప్రక్రియను ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి పర్యవేక్షిస్తారు. ప్రతి దశలో ఓటర్లకు ఎస్ఎంఎస్ (SMS) ద్వారా సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. ఇది ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డు స్థితిని తెలుసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.