Telangana: పులిచింతల ప్రాజెక్ట్‌పై సరసర పాకుతున్న శబ్ధం.. ఒక్కసారిగా చూస్తే షాక్!

| Edited By: Balaraju Goud

Oct 02, 2024 | 7:29 PM

పులిచింతలలో రాత్రి సమయంలో అనకోకుండా ఒక కారు ప్రాజెక్ట్ పైకి వచ్చింది. కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది.

Telangana: పులిచింతల ప్రాజెక్ట్‌పై సరసర పాకుతున్న శబ్ధం.. ఒక్కసారిగా చూస్తే షాక్!
Crocodile
Follow us on

పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వతో నిండు కుండలా మారింది. గుంటూరు – నల్గొండ జిల్లాల మధ్య ఉన్న ప్రాజెక్ట్ పై నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుంటాయి. భారీ వాహనాలకు అనుమతి లేదు గాని ద్విచక్ర వాహనాలు, స్థానికులు అటు ఇటు రాకపోకలు పులిచింతల ప్రాజెక్ట్ నుండే చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అనకోకుండా ఒక కారు ప్రాజెక్ట్ పైకి వచ్చింది. కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన కారు డ్రైవర్ నీటిలో ఉండాల్సిన మొసలి ప్రాజెక్ట్ పైకి వచ్చినట్లు గుర్తించాడు. అంతేకాకుండా తన సెల్ ఫోన్‌లో మొసలి కదలికలు రికార్డ్ చేశారు.

అనంతరం ఈ విషయాన్ని ప్రాజెక్ట్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మొసలిని తెలంగాణ వైపు నుండి ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా చేయగలిగారు. అయితే గతంలోనూ ప్రాజెక్ట్ లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన సమయంలో పెద్ద పెద్ద రాళ్లపై మొసళ్లు కనిపించాయి. దీంతో ప్రాజెక్ట్ లో మొసళ్ల సంచారం ఉన్నట్లు గుర్తించారు. ఈ సారి ఏకంగా ప్రాజెక్ట్ పైకి రావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్ట్ వరకూ ఉన్న క్రిష్ణా నది తీరంలో మొసళ్ల సంచారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. నాగార్జున సాగర్ వద్ద నున్న ఎత్తిపోతల వద్ద కూడా మొసళ్ల సంచారం ఉన్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

పల్నాడు ప్రాంతంలోని వాగుల్లో కూడా మొసళ్లు కదలికలు గుర్తించారు. తాజాగా పిడుగురాళ్ల వద్ద కూడా రెండు మొసళ్లను గుర్తించిన సిబ్బంది వాటిని కృష్ణా నదిలో వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే పులిచింతల రిజర్వాయర్ లో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సంచరించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..