18నెలల తర్వాత ఉపశమనం, జమ్ముకశ్మీర్‌లో అందుబాటులోకి 4జీ ఇంటర్నెట్ సేవలు

|

Feb 06, 2021 | 4:17 AM

జమ్ముకాశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇక్కడి ప్రజలకు ఊరట లభించింది. ఫలితంగా ఏడాదిన్నర తర్వాత ఆంక్షల నుంచి..

18నెలల తర్వాత ఉపశమనం, జమ్ముకశ్మీర్‌లో అందుబాటులోకి  4జీ ఇంటర్నెట్ సేవలు
Follow us on

జమ్ముకాశ్మీర్‌లో 18 నెలల తర్వాత 4జీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఇక్కడి ప్రజలకు ఊరట లభించింది. ఫలితంగా ఏడాదిన్నర తర్వాత ఆంక్షల నుంచి రిలీఫ్‌ లభించినట్టయింది. జమ్మూకశ్మీర్‌లో 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇక్కడ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్‌ సేవలపై కూడా ఎప్పటికప్పుడు ఆంక్షలు కొనసాగించింది. దీంతో దాదాపు 18 నెలల తర్వాత 4జీ ఇంటర్‌నెట్‌ సేవలను పునరుద్ధరించనుంది. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు విద్యుత్‌, సమాచార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు.

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు.. ముగ్గురు మాజీ సీఎంలను సుదీర్ఘ కాలంగా నిర్బంధంలో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. చాలా రోజుల పాటు అక్కడ కర్ఫ్యూ కొనసాగింది. జనం బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మాత్రమే కొంత సమయం పాటు కర్ఫ్యూని సడలిస్తూ వచ్చారు.

అదే సమయంలో ఇంటర్నెట్‌ సేవలపైనా ఆంక్షలు విధించారు. సోషల్‌ మీడియా ద్వారా ఇష్టారీతిలో పోస్ట్‌లు పెట్టడంతో పాటు ఆర్టికల్‌ 370 రద్దుపై ఉద్యమించే ప్రమాదం ఉండటంతో ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌లో ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌పై కూడా ఆంక్షలు విధించారు. తాజాగా 4జీ ఇంటర్‌నెట్‌ సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 4జీ ఇంటర్‌నెట్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారు కాస్తా రిలీఫ్‌ ఫీలవుతున్నారు. కొంత ఆలస్యంగానైనా ప్రభుత్వం 4జీ ఇంటర్‌నెట్‌ సర్వీసులు తిరిగి ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీల ఆఫ్ ద రికార్డ్ వీడియోపై బాలశౌరి రియాక్షన్, లోకేశ్‌ పిచ్చి ట్వీట్లు మానుకోవాలని కామెంట్