
మధ్యతరగతి ఇళ్లలో వంట నూనె వృధా కాకూడదని చేపలు లేదా చికెన్ వేయించిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఈ చిన్న పొదుపు మీ ప్రాణాల మీదకు తెస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి మరిగించిన నూనెను తిరిగి వేడి చేయడం వల్ల అది నెమ్మదిగా పనిచేసే విషంలా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సీనియర్ డైటీషియన్ డాక్టర్ పద్మిని పి.వి. తెలిపిన వివరాల ప్రకారం.. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల దాని రసాయన నిర్మాణం మారిపోతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ – ఫ్రీ రాడికల్స్: ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచి, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
విష పదార్థాలు: నూనెను పదేపదే మరిగించడం వల్ల అక్రిలమైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి 4 రకాల ప్రమాదకర విషపదార్థాలు విడుదలవుతాయి.
క్యాన్సర్ కారకాలు: ఈ నూనెలో ఏర్పడే కార్సినోజెనిక్ పదార్థాలు కణజాలంపై ప్రభావం చూపి, క్యాన్సర్కు దారితీస్తాయి.
ముఖ్యంగా నాన్-వెజ్ వంటకాలు వేయించినప్పుడు, ఆహారంలోని తేమ, ప్రోటీన్ కణాలు నూనెలో కలిసిపోతాయి. దీనివల్ల ఆ నూనె త్వరగా ఆక్సీకరణం చెందుతుంది. గాలి తగలడం, అధిక వేడి వల్ల నూనెలోని పోషకాలు పోయి, హానికరమైన జన్యు మార్పు కారకాలు తయారవుతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం నూనెను మళ్లీ ఉపయోగించకపోవడమే ఉత్తమం. ఒకవేళ వాడాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
వడకట్టడం: నూనె చల్లారిన తర్వాత అందులోని ఆహార కణాలు లేకుండా సన్నని గుడ్డ లేదా జల్లెడతో వడకట్టాలి.
తక్కువ వేడి: తిరిగి వాడేటప్పుడు నూనెను పొగలు వచ్చేలా కాకుండా, మధ్యస్థ మంట మీద మాత్రమే వేడి చేయాలి.
కలపవద్దు: పాత నూనెను కొత్త నూనెతో అస్సలు కలపకూడదు.
రంగు మారితే: నూనె నల్లగా మారినా, నురుగు వచ్చినా లేదా వింత వాసన వస్తున్నా.. అది పూర్తిగా పాడైపోయిందని అర్థం. దాన్ని వెంటనే పారవేయాలి.
ఇళ్లలో కంటే రోడ్డు పక్కన దొరికే బజ్జీలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నూనెను రోజులు తరబడి మరిగిస్తూనే ఉంటారు. హోటళ్లలో వాడే ఈ రీ-హీటెడ్ ఆయిల్ వల్ల అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కాలేయం పాడయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి నూనె కోసం ఆశపడి విలువైన ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే వంటకు ఎప్పుడూ తాజా నూనెను వాడటమే మంచిది.