
చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు. పిల్లల ఆహారం విషయంలో “వాళ్లు ఇంకా పెరుగుతున్నారే… వాళ్లు కోరుకున్నది తిననివ్వాలి” అని భావిస్తుంటారు. కానీ, వాస్తవానికి, చిన్న వయసులో ఏర్పడే ఆహారపు అలవాట్లు వారి భవిష్యత్తు వ్యాధులను నిర్ణయిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర పానీయాలు, ఉప్పుగా ఉండే స్నాక్స్కి అలవాటు పడిన పిల్లలు అనుకోకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదంలో ఉంటారు. సీనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వికాస్ కోహ్లీ చెబుతున్న ముఖ్యాంశాలు ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాల్సినవే.
నేటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్యాక్ చేసిన ఆహారాలు, చిప్స్, ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక సోడియం ఉంటుంది. ఇది పిల్లల్లో రక్తపోటును పెంచి, గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంది.
శీతల పానీయాలు, క్యాండీలు, బేకరీ పదార్థాల్లో అధికంగా ఉండే చక్కెర పిల్లల్లో ఊబకాయానికి కారణమవుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అధిక చక్కెర రక్తనాళాల్లో వాపును కలిగించి, రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
చాలా ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ను పెంచి, గుండె ధమనులను గట్టిపరుస్తాయి. ఇవి చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలకు బీజం వేస్తాయి.
ప్రస్తుత డేటా ప్రకారం, భారతీయులు రోజుకు సగటున 9 నుంచి 11 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 5 గ్రాముల కంటే దాదాపు రెట్టింపు. 2022లో లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. సుమారు 12.5 మిలియన్ల భారతీయ పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇవి ఆందోళన కలిగించే సంఖ్యలు.