
జుట్టు రాలిపోతుందని.. ఎన్నిషాంపూలు వాడినా చుండ్రు తగ్గడం లేదని ఇలాంటి మాటలు తరచూ వింటూంటాం. ఇటీవల కాలంలో దాదాపు అందరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక, ముఖంపై మొటిమల సంగతి చెప్పనే అక్కర్లేదు. అయితే, వీటన్నింటికీ పరిష్కారం ఖరీదైన షాంపూలు, క్రీముల్లో కాదు.. మన పూర్వికులు వాడిన కుంకుడుకాయల్లో ఉందంటోంది ఆయుర్వేదం. మరి ఈ సారి వాటితోనే తలస్నానం చేసి చూడండి. ఫలితం మీకే కనిపిస్తుంది.
కుంకుడు కాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే, దీన్ని నేరుగా వాడే బదులు, కాసిని మందార ఆకుల్ని కలిపి తలస్నానం చేయండి. ఇలా కనీసం నాలుగైదు వారాలు చేసి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. కుంకుడుకాయలకు యాంటీ అలర్జీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. అందుకే చర్మానికి క్లెన్సర్గానూ వాడొచ్చు. మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ దూరమవుతాయి. ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. క్రమంగా మీ సమస్య దూరమవుతుంది. కాలుష్యం, ఇతరత్రా సమస్యలు… ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందికి చెక్ పెట్టడానికి కుంకుడు రసం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు.
వాటిని రెండు మూడు గంటల ముందు నానబెట్టి రసం తీసి, దీనికి పావు కప్పు కలబంద గుజ్జు కలిపి తలకు రాయాలి. ఆపై ఐదు నిమిషాలాగి రుద్ది తలస్నానం చేస్తే మాడు నుంచి చివర్ల వరకూ పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావం కూడా వదిలిపోతుందట. చాలామంది ముఖంపై చూపిన శ్రద్ధ పాదాలపై చూపించరు. దీనివల్ల అవి కాంతివిహీనంగా కనిపిస్తాయి. గోళ్లు, మడమలు మురికిగా మారతాయి. వీటిని శుభ్రం చేయడానికి కుంకుడు రసంలో కాస్త గులాబీనీరు చేర్చి ఓ పదినిమిషాలు నానబెట్టండి. ఆపై కొబ్బరి పీచుని తీసుకుని మృదువుగా రుద్దండి. టాన్, డెడ్స్కిన్ వదిలిపోయి.. పాదాలు కోమలంగా మారతాయి.
ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..