గూగుల్ పై కేసు..ఇది మూడోసారి !
భారత్లో గూగుల్ ఎదుర్కొంటున్న ప్రధాన అవిశ్వాస సవాళ్లలో ఇది మూడోది. 2018లో గూగుల్కు 21 మిలియన్ డాలర్ల జరిమానాను సీసీఐ విధించింది. సెర్చ్ బయాస్ విషయంలో ఈ భారీ జరిమానా విధించింది. గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మార్కెట్లో తనకున్న స్థానాన్ని దుర్వినియోగపరిచిందని నివేదికలు వెలువడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి గూగుల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పేను ప్రమోట్ చేస్తుందనే ఫిర్యాదుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేసు నమోదు చేసి పరిశీలిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరిలో ఈ మేరకు ఫిర్యాదు నమోదయింది. అయితే ఈ వ్యవహారాన్ని సీసీఐ రహస్యంగా ఉంచిందని ఓ అధికారి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో తన ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో గూగుల్ పేను ప్రదర్శిస్తోంది. మార్కెట్ పోటీదారులకు ఇది విఘాతం కలిగించే చర్య. ఖాతాదారుల ప్రయోజనాలను కూడా ఇది దెబ్బతిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది.
గూగుల్ పై కేసు నమోదు చేసినట్టు కొన్ని రోజుల క్రితమే సంస్థకు సీసీఐ తెలియజేసిందని అధికారులు వివరించారు. షెడ్యూల్ ప్రకారం గూగుల్ స్పందించనుందని సమాచారం. ఇదిలావుండగా కేసు ఫైలింగ్ను సీసీఐ సీనియర్ మెంబర్లు పరిశీలిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అధికారుల ముందు గూగుల్ ప్రతినిధులు హాజరవ్వాల్సి ఉంటుంది. గూగుల్ తరపున వివరణ ఇచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలన్నది తేలుతుందని ఓ అధికారి తెలిపారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు లేదా సరైన ఆధారాలు లేకపోతే కేసును కొట్టివేసే అధికారాలు సీసీఐకి ఉంటాయని, ప్రస్తుతం కేసు పరిగణనలోనికి తీసుకునే స్థాయిలోనే ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.. ఈ వ్యవహారంపై సీసీఐ కూడా స్పందించలేదు.
ఇదిలా ఉంటే, భారత్లో గూగుల్ ఎదుర్కొంటున్న ప్రధాన అవిశ్వాస సవాళ్లలో ఇది మూడోది. 2018లో గూగుల్కు 21 మిలియన్ డాలర్ల జరిమానాను సీసీఐ విధించింది. సెర్చ్ బయాస్ విషయంలో ఈ భారీ జరిమానా విధించింది. అయితే కంపెనీ అప్పీల్ చేయడంతో ఈ వ్యవహారం పెండింగ్లో ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగించేలా మొబైల్ తయారీదారుల సామర్థ్యాన్ని గూగుల్ అణచివేస్తోందనే ఫిర్యాదుపై గతేడాది మరో ఫిర్యాదుపై సీసీఐ దర్యాప్తు ప్రారంభించిన సంగతి విధితమే.