థియేటర్‌లో అమానుష ఘటన.. టిక్కెట్ ఉన్నా.. సినిమా చూసేందుకు సంచార జాతిని అనుమతించని సిబ్బంది

Chennai Theatre Untouchability: సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన వారిని థియేటర్‌లోకి రానివ్వకుండా చేసిన ఘటన సంచలనంగా మారింది.

థియేటర్‌లో అమానుష ఘటన.. టిక్కెట్ ఉన్నా.. సినిమా చూసేందుకు సంచార జాతిని అనుమతించని సిబ్బంది
Chennai Theatre Untouchability

Updated on: Mar 30, 2023 | 12:30 PM

శింబు నటించిన పత్తు తల చిత్రం థియేటర్లలో విడుదలైంది. దీంతో ఉదయం 8 గంటలకు సినిమా బెన్‌ఫిట్ షో ప్రదర్శించారు. సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుండే థియేటర్ ముందు గుమిగూడిన అభిమానులు శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సినిమాను చూసేందుకు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన వారిని థియేటర్‌లోకి రానివ్వకుండా చేసిన ఘటన చెన్నైలో సంచలనంగా మారింది. రోహిణి థియేటర్‌‌లో సినిమా చూసేందుకు ఇద్దరు మహిళలు, ఒక బాలుడు డబ్బు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే వారి థియేటర్ గేటు వద్దే అడ్డుకున్నారు సిబ్బంది. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వహకులు కనికరించలేదు. వారికి ప్రవేశం లేదంటూ తిప్పి పంపించేశారు. ఇది చూసి షాక్ అయిన శింబు అభిమానులు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

చెన్నై లాంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి అంటరానితనం ఘటన కలకలం రేపుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు థియేటర్ ఉద్యోగిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చిన వారిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పై సంగీత దర్శకుడు జివి ప్రకాష్ స్పందించారు. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. వారిని సినిమా చూసేందుకు అనుమింతించాలన్నారు. టికెట్ ఉన్న థియేటర్ లోకి రానివ్వకపోవడం సరికాదన్నారు. థియేటర్‌లో సినిమా చూసే విషయంలో అందరూ సమానమేనన్నారు. దీంతో దిగి వచ్చిన థియేటర్ నిర్వహకులు ఆ ముగ్గురికి సినిమా చూసేందుకు అవకాశం కల్పించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం…

Loading...
Unable to load recommendations.
Follow Us