లేడి అమితాబ్గా ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. 13 సంవత్సరాల తరువాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకతవ్ంలో మహేశ్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆమె.. ఇకపై సినిమాల్లో కూడా కొనసాగుతారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇవి కాస్త ఆమె చెవిన పడటంతో వాటిపై స్పష్టతను ఇచ్చింది రాములమ్మ. ఆరు నెలల క్రితమే తనకు సినిమా అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పార్టీ ప్రచార బాధ్యతలు ఉండటంతో సాధ్యం కాదని ఒప్పుకోలేదని విజయశాంతి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగియం.. రాజకీయ అవసరాలు పెద్దగా లేనందునే సినిమాలపై దృష్టిపెట్టానని పేర్కొన్నారు. ఇకపై రెండింటిలో కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తనకు ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో చేయడం అలవాటని విజయశాంతి వివరించారు.
అయితే తన రాజకీయ అరంగేట్రాన్ని బీజేపీతో ప్రారంభించిన ఆమె.. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారు. కొన్నేళ్లపాటు ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పార్టీనీ వీడిన విజయశాంతి కాంగ్రెస్లో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.