
హాస్యనటి మమత, అసలు పేరు ఝాన్సీ రాణి, తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసినప్పటికీ, ఆమె జీవితం విషాదభరితంగా ముగిసింది. గుంటూరులో పుట్టి పెరిగిన ఝాన్సీ రాణికి చిన్నప్పటి నుంచే నాటకాలపై, నృత్యంపై అపారమైన ఆసక్తి ఉండేది. రంగస్థల నటుడైన ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో నాటకాల్లో నటించారు. మద్రాసులో వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. ఈ సమయంలోనే హేమమాలిని, రేఖ వంటి ప్రముఖ నటీమణులు ఆమె సహ విద్యార్థులు. తొలుత నాటకాలలో, ముఖ్యంగా చంద్రమోహన్ సరసన ఎన్నో నాటకాల్లో నటించారు. 1972లో కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ భార్య చిత్రంలో చిన్న పాత్రతో సినీరంగ ప్రవేశం చేశారు. చలం నిర్మించిన దేవతమ్మ సినిమాలో హాస్యరాజు రాజబాబు పక్కన నటించిన తర్వాత ఆమెకు మమత అనే పేరు స్థిరపడింది. హాస్యనటిగా మంచి గుర్తింపు లభించింది. దేవుడు చేసిన మనుషులు, బంగారు కలలు వంటి చిత్రాలలో హాస్య పాత్రలతో ఆమె ప్రేక్షకులను అలరించారు.
అయితే, హీరోయిన్గా ఎదగాలనే ఆకాంక్షతో 1975లో విఠలాచార్య దర్శకత్వంలో ఆడదాని అదృష్టం చిత్రంలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మలయాళ చిత్రసీమ మమత హీరోయిన్ కావాలనే కలను కొంతవరకు నెరవేర్చింది. ఆనియన్ (పడకగది), సత్రత్తిల్ ఒరు రాత్రి (సత్రంలో ఒక రాత్రి) వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా సత్రత్తిల్ ఒరు రాత్రి చిత్రంలో ఆమె శృంగారభరితమైన, సాహసోపేతమైన పాత్ర పోషించి అక్కడ స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఒక సన్నివేశంలో ఆమె దాదాపు నగ్నంగా కనిపించడం చర్చనీయాంశమై, ఆ సినిమా నిషేధానికి కూడా దారితీసింది. మొత్తం ఏడు మలయాళ చిత్రాల్లో శృంగార పాత్రలు పోషించిన మమత, ఈ ఇమేజ్ కారణంగా తెలుగులో హీరోయిన్ అవకాశాలను కోల్పోయారు. ఒకటి రెండు అవకాశాలు వచ్చినా చివరి నిమిషంలో చేజారిపోయాయి. దాంతో ఆమె మళ్ళీ హాస్యనటిగానే కొనసాగాల్సి వచ్చింది.
డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి చిత్రాలు ఆమెను తిరిగి హాస్యనటిగా బిజీ చేశాయి. తన కెరీర్లో 250కి పైగా చిత్రాలలో నటించి డబ్బు సంపాదించినప్పటికీ, ఆమెకు చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. హాస్య నటనలో పోటీ పెరగడం, తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి వెళ్ళినప్పుడు ఆమె మద్రాసులోనే ఉండిపోవడం అవకాశాలు తగ్గడానికి ప్రధాన కారణాలు. మంచి మనసున్న మమత అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసేవారు, అమాయకురాలైన ఆమె అందరినీ సులభంగా నమ్మేవారు. తన బంధువులకు ఆర్థిక సహాయం చేసినప్పటికీ, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదు. ఒక వ్యక్తిని నమ్మి మోసపోయి పెళ్లికి దూరమయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఆమెను కుంగదీశాయి. చివరకు తినడానికి తిండి కూడా లేకుండా దారిద్ర్యంలోకి జారిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయం తెలిసి ఆమెకు రూ.50,000 పంపించి ఆదుకున్నారు. అయితే ఆ డబ్బు ఖర్చయిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తనపై ఆధారపడిన తమ్ముడికి, అతని పిల్లలకు అండగా నిలిచినా, ఆమెకు సొంత ఇల్లు కూడా సమకూరలేదు. 2003 అక్టోబర్ 23న మమత ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఎందరినో నవ్వించిన ఈ హాస్యనటి అంత్యక్రియలకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం సినీ పరిశ్రమలోని విషాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
Also Read: చిరంజీవి సరసన స్వాతి..?.. అప్పటి స్వాతినే.. ఇప్పటి…