Comedian Ramachandra : వాళ్లని నమ్మి కోట్లలో మోసపోయా.. తిండి లేక ఆస్తులు అమ్మేశా.. వెంకీ సినిమా కమెడియన్ ఎమోషనల్..

మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించిన హాస్యనటులలో రామచంద్ర ఒకరు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అతడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పక్షవాతంతో కాళ్లు పడిపోగా.. దీనస్థితిలో గడుపుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ స్ట్రగుల్స్ చెప్పుకొచ్చారు.

Comedian Ramachandra : వాళ్లని నమ్మి కోట్లలో మోసపోయా.. తిండి లేక ఆస్తులు అమ్మేశా.. వెంకీ సినిమా కమెడియన్ ఎమోషనల్..
Rama Chandra

Updated on: Jan 31, 2026 | 12:55 AM

తెలుగు హాస్యనటుడు రామచంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. వెంకీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం తన 25 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో పంచుకున్నారు. 2000వ సంవత్సరంలో “నిన్ను చూడాలని” సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రామచంద్ర, ఆ తర్వాత “ఆనందం”, “వెంకీ”, “గౌతమ్ ఎస్ఎస్సి”, “దుబాయ్ శీను”, “కింగ్”, “లౌక్యం”, “డీజే” వంటి 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఇంత అనుభవం, అనేక స్టార్ హీరోలతో కలిసి నటించినప్పటికీ, తన పేరు చాలా మందికి తెలియదని, కేవలం పాత్రల ద్వారానే గుర్తుపడతారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో కొందరు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు “మీరెవరు సార్, ఏం చేశారు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే” అని అడిగినప్పుడు కలిగే బాధను ఆయన వివరించారు. ఈ గుర్తింపు లేమి తనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, తాను చేసిన కృషికి సరైన గుర్తింపు లభించలేదన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

రామచంద్ర కెరీర్ ప్రారంభం సులువుగా ఉన్నప్పటికీ, నాలుగైదు సినిమాల తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. తన తల్లిదండ్రులు బ్యాంక్ ఉద్యోగులని, నటుడిగా మారాలనే కోరికతోనే సినీ రంగంలోకి ప్రవేశించానని తెలిపారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆయన వెల్లడించారు. నమ్మిన ఇద్దరు స్నేహితుల కోసం ష్యూరిటీ పెట్టి సంతకాలు చేయడంతో దాదాపు 45-50 లక్షల రూపాయలు కోల్పోయానని ఆయన తెలిపారు. దీంతో తనకున్న భూమిని కూడా అప్పుల కోసం అమ్మేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. నాలుగైదేళ్ల క్రితం కాలుకు గాయం కావడంతో మూడు సంవత్సరాల పాటు షూటింగ్ లకు దూరమయ్యానని, ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆయన వివరించారు. ఈ కష్టకాలంలో సహ నటులైన శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రావిపూడి, గిరిధర్, చిత్రం శీను వంటి వారు ఆర్థిక సహాయం అందించారని, వారికి రుణపడి ఉంటానని రామచంద్ర చెప్పారు. తీసుకున్న డబ్బులను కొంతమందికి తిరిగి చెల్లించానని, మరికొంతమందికి తిరిగి ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..

ఆర్థిక ఇబ్బందులు, పని లేని సమయాల్లో డిప్రెషన్ లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, అద్దెలు, ఈఎంఐలు వంటి ఖర్చులు ఆగవని గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవాల ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని తాను గ్రహించానని రామచంద్ర తెలిపారు. డబ్బులు ఉన్నప్పుడే ప్రతి నటుడు బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం చాలా అవసరమని, తాను ఈ పొరపాటు చేయడం వల్లే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ఎలాంటి హెచ్చుతగ్గులు వచ్చినా తట్టుకునేలా ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అని ఆయన తోటి నటులకు సూచించారు. రామచంద్ర తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, పట్టుదలగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..