Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ కథ ఇదే.. అసలు నవలలో ఏముందంటే

|

Oct 04, 2022 | 5:26 PM

ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం ఈ సినిమాలో నటించారు.

Ponniyin Selvan: మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కథ ఇదే.. అసలు నవలలో ఏముందంటే
Ponniyin Selvan
Follow us on

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షాదరణ పొందుతోంది ఈ సినిమా. ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం ఈ సినిమాలో నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.  సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రాయగా.. సినిమాటోగ్రఫర్‌గా రవి వర్మన్ పనిచేశారు.

పొన్నియిన్ సెల్వన్ అనేది ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు.తన మ్యాగజీన్ ‘కల్కి’ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 ఆయన కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన ‘ది చోళాస్’ పుస్తకం
టి.వి. సదాశివ బండారుతార్ రచించిన ‘హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్, ఆర్. గోపాలన్ రాసిన ‘పల్లవాస్ ఆఫ్ కంచి’ అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.

ఈ నవల కోసం చోళులు పాలించిన అనేక ప్రాంతాల్లో కల్కి పర్యటించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువారూర్, అరియలూరుతో పాటు శ్రీలంకలో కూడా పర్యటించారు. ఆయన వెంట మణియన్ అనే చిత్రకారుడు కూడా వెళ్లారు
కల్కి మ్యాగజీన్‌లో పొన్నియన్ సెల్వన్ నవలలో ప్రచురించిన చిత్రాలన్నీ మణియన్ గీశారు. ఈ నవల 2,400 పేజీలు ఉంటుంది. దీన్ని 5 భాగాలుగా రాశారు.

ఇవి కూడా చదవండి

పొన్నియిన్ సెల్వన్ కథ ఏంటి?

పరాంతక చోళుడు-2 పాలన చివరి సంవత్సరాల గురించి ఈ నవలలో పేర్కొన్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారు కుందవై, ఆదిత్య కరికాలన్, అరుల్‌ మొళి వర్మన్. వీరిలో ఆదిత్య కరికాలన్‌కు ‘యువరాజు’ అనే బిరుదు దక్కింది
పరాంతక చోళుని తర్వాత ఆదిత్య కరికలన్ రాజు అవుతాడు. కాంచీపురంలో ఆదిత్య కరికలన్ ఒక బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. ఆ తర్వాత తంజావూరులో ఉండే తన తండ్రి పరాంతక చోళుడిని కాంచీపురంలోని బంగారు భవనంలో నివసించడానికి రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి, దాన్ని తన మిత్రుడు వందియతేవన్‌కు ఇచ్చి పంపిస్తాడు. ఆ ఉత్తరం తీసుకొని వందియతేవన్, తంజావూరుకు బయల్దేరతాడు. మార్గం మధ్యలో కదంపూర్ అనే భవనంలో వందియతేవన్ విశ్రాంతి తీసుకుంటాడు. అదే సమయంలో చోళ రాజ్య కోశాధికారి పలువెట్టయార్ నేతృత్వంలో ఆదిత్య కరికాలన్‌కు వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి వందియతేవన్ తెలుసుకుంటాడు.

అదిత్య కరికలన్ ఇచ్చిన ఉత్తరాన్ని కుందవై, పరాంతక చోళుడికి వందియతేవన్ అందజేస్తాడు. శ్రీలంకలో యుద్ధంలో తలపడుతోన్న తన తమ్ముడు అరుల్‌ను తీసుకురావాల్సిందిగా కోరుతూ కుందావై, వందియతేవన్‌ను శ్రీలంకకు పంపిస్తుంది. దీంతో వందియతేవన్, శ్రీలంక వెళ్తాడు. పలువెట్టరైయార్ అదే సమయంలో అరుల్ మొళి వర్మన్‌ను బందీగా తీసుకురావడానికి శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. వందియతేవన్, అరుల్ మొళి వర్మన్‌లను తీసుకువస్తుండగా ఆ ఓడలు తుపానులో చిక్కుకుంటాయి. వీరిద్దరిని పూంగుళలీ అనే ఒక జాలరి కాపాడుతుంది.

అరుల్‌మొళి వర్మన్ అనారోగ్యం పాలవ్వడంతో చికిత్స కోసం నాగపట్టణంలోని ఒక బౌద్ధ మందిరానికి తీసుకు వెళతారు. అదే సమయంలో ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించి తన పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించాలనే పలువెట్టయార్ కుట్రలు ఊపందుకుంటాయి. ఈ కుట్రలో పలువెట్టయార్ భార్య నందిని కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఆదిత్య కరికలన్‌ను కదంబూర్ అనే ప్రాంతంలోని ఒక భవనంలోకి పిలిపించి హత్య చేయాలని పథకం పన్నుతారు. పథకం ప్రకారమే ఆదిత్యను హత్య చేస్తారు. ఈ హత్యా నేరం వందియతేవన్‌ పై పడుతుంది ఇది ఆ నవల లోని కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..