Actress Jaya Prada: సీనియర్‌ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..

|

Aug 11, 2023 | 2:47 PM

సినీ నటి, సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎంపీ అయిన జయప్రద.. చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో జయప్రద సినిమా థియేటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని ఓ ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నటిపై చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు థియేటర్‌ నిర్వాహకులు జయప్రదతో పాటుగా..

Actress Jaya Prada: సీనియర్‌ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..
Actress Jaya Prada
Follow us on

చెన్నై, ఆగస్టు 11: టాలీవుడ్‌ సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై కోర్టు షాక్‌ ఇచ్చింది. ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం (ఆగస్టు 11) కోర్టు తీర్పు వెలువరించింది. నటి జయప్రదకు చెందిన ‘జయప్రద థియేటర్ కాంప్లెక్స్‌’లోని కార్మికుల నుంచి వసూలు చేసిన ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) ఫండ్ వాటాను చెల్లించనందుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు వెల్లడించింది.

కేసు వివరాలు ఇవే..

సినీ నటి, సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎంపీ అయిన జయప్రద.. చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో జయప్రద సినిమా థియేటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని ఓ ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నటిపై చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు థియేటర్‌ నిర్వాహకులు జయప్రదతో పాటుగా ఇద్దరు పార్టనర్స్‌కు ఎగ్మోర్ కోర్టు 6 నెలలు జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. గతంలో కూడా జయప్రద థియేటర్ కాంప్లెక్స్‌కు సంబంధించి దాదాపు రూ.20 లక్షలు ట్యాక్స్‌ చెల్లించనందుకు సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు థియేటర్‌లోని కుర్చీలు, ప్రొజెక్టర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

80లలో నటి జయప్రద తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అందరు అగ్ర నటులతో నటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. హిందీలో జితేంద్ర, రిషీ కుమార్‌ వంటి అగ్ర హీరోలు ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూసేవారు. ఇక తెలుగునాట ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో 1994లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఐతే ఆ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఆమె టీడీపీకి స్వస్తిపలికి ఎస్పీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొంది 2004 నుంచి 2014 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.