ఒకే ఇమేజ్కు పరిమితం కావొద్దంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్!
దేశవ్యాప్తంగా భారీ అభిమానుల బలం సంపాదించుకున్న ఈ యువ నటి 2025 సంవత్సరాన్ని అద్భుత విజయాలతో ముగించింది. ‘ఛావా’, ‘కుబేరా’, ‘ది గర్ల్ఫ్రెండ్’ వంటి చిత్రాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి. త్వరలో నాయికా ప్రాధాన్య చిత్రం ‘మైసా’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో తన ఆలోచనలు, లక్ష్యాలు పంచుకుంది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపు సాధించిన ఈ కథానాయిక ‘కిరిక్ పార్టీ’తో మొదలైన ప్రయాణం అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్డమ్కు తీసుకెళ్లింది. కమర్షియల్ ఎంటర్టైనర్ల నుంచి కంటెంట్ ఆధారిత చిత్రాల వరకు విభిన్న కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. 2025లో వరుస హిట్లతో జోరుమీదున్న ఆమెకు ఈ ఏడాది చాలా ప్రత్యేకమని అనిపించింది.
ఇక రష్మిక మందానా తన గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. “ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందని చెప్పలేను. కానీ 2025 నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. కుటుంబం, స్నేహితుల సంతోషమే నాకు నిజమైన విజయం. ప్రేక్షకుల ప్రేమే అసలైన బహుమతి” అని చెప్పింది.
నటిగా ఒకే ఇమేజ్కు పరిమితం కాకుండా భిన్న పాత్రలు పోషించాలని కోరుకుంటున్నానని రష్మిక స్పష్టం చేసింది. “మంచి అమ్మాయి, అమాయకురాలు అనే టైప్కాస్టింగ్ వద్దు. నాలోని విభిన్న కోణాలు తెరపై కనిపించాలి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, పాత్రల మధ్య తేడా ఉండాలి. అదే నాకు బలం” అని వివరించింది. దర్శకులు, రచయితలపై పూర్తి నమ్మకంతో కథ నచ్చితే వందశాతం అంకితమవుతానని చెప్పింది.

Rashmika.mandanna
“నేను ఒక ఎంటర్టైనర్ని. ప్రేక్షకులను అలరించడమే నా ప్రధాన లక్ష్యం. దర్శకులు ఊహించిన దిశలో నన్ను మలుచుకుంటాను” అంటూ రష్మిక తన ఆలోచన విధానాన్ని వెల్లడించింది. భాషలకు అతీతంగా ప్రతి పరిశ్రమను సమానంగా గౌరవిస్తానని, పూర్తి బాధ్యతతో పనిచేస్తానని పేర్కొంది.
తన వ్యక్తిగత ప్రయాణంలో అనుభవాలే బలమని, చిన్ననాటి ఆందోళనలు, భయాలను అధిగమించి ముందుకు వచ్చానని రష్మిక గుర్తుచేసుకుంది. “నాలో వచ్చిన ప్రతి చిన్న మార్పు గొప్ప విజయం. అప్పుడప్పుడు నన్ను నేను మెచ్చుకుంటాను” అని చెప్పిన ఆమె వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మొత్తంగా, నిరంతరం ఎదుగుతూ, కొత్త సవాళ్లు స్వీకరిస్తున్న రష్మిక మందానా ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. ‘మైసా’తో మరింత శక్తివంతంగా కనిపించనున్న ఆమెను అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
