
చాలా రోజుల తర్వాత ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మళ్లీ వెండితెరపై కనిపించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఈ సినిమాలో పోసాని ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్గానూ బాధ్యతలు చేపట్టారు. పోసానితోపాటు హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం (జులై 17) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సుమారు 150కి పైగా చిత్రాలకు పనిచేసిన పోసాని రాజకీయాల్లో చేరి ఇండస్ట్రీకి దూరమైపోయారు. మళ్లీ ఇప్పుడు ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన పోసాని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో రామ్ చరణ్ ‘నాయక్ సినిమా తన జీవితాన్ని ఎంతలా మార్చేసిందో వివరించారు.
‘నా సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రాల్లో ‘నాయక్’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ చిత్రం దర్శకుడు వీవీ వినాయక్ అంటే నాకు ప్రాణం. నేను ఆయన్ను ప్రేమగా ‘వినయ్’ అని, ఆయన నన్ను ‘మురళి’ అని పిలుచుకుంటాం. ఒకసారి నేను వేరే సినిమా షూటింగ్ లో ఉండగా వినాయక్ ఫోన్ చేశారు. రామ్ చరణ్తో చేస్తున్న ‘నాయక్’ సినిమాలో ఒక పాత్ర ఉందన్నారు. ఒక మూడు రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయగలరా అని అడిగారు. ఆయనపై ఉన్న గౌరవంతో నేను వెంటనే సరే అన్నాను. కానీ షూటింగ్ మొదటి రోజే నేను చెప్పిన డైలాగ్స్కు, నా యాక్టింగ్కు సెట్స్లో ఉన్నవారంతా పగలబడి నవ్వారు. చప్పట్లు కొట్టారు. ఇక నా టైమింగ్ చూసి ఇంప్రెస్ అయిన వినాయక్.. మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి, మీ సీన్స్కు రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అందుకే మీ పాత్ర నిడివిని మరింత పెంచుతున్నాం అని చెప్పారు. అలా కేవలం మూడు రోజుల కోసం అనుకున్న నా క్యారెక్టర్, ఏకంగా 18 రోజుల నిడివి గల పూర్తి స్థాయి పాత్రగా మారిపోయింది . ఇక సినిమా ఫైనల్ కాపీ చూసిన మెగాస్టార్ చిరంజీవి నా కామెడీ సీన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. పోసాని సీన్స్ చాలా బాగా వచ్చాయి, అందులో ఒక్క సీన్ కూడా కట్ చేయవద్దని చిరంజీవే స్వయంగా వినాయక్కు సూచించారు
‘ నాయక్ సినిమాలో నా పాత్రకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతలా అంటే.. సినిమా రిలీజ్ అయిన కేవలం వారం రోజుల్లోనే నా వద్దకు ఏకంగా 36 కొత్త సినిమా ఛాన్సులు వచ్చాయి. అలా నటుడిగా నాకు అంతటి లైఫ్ ఇచ్చిన ‘నాయక్’ సినిమాను, దర్శకుడు వినాయక్ను నేను ఎప్పటికీ మరువలేను’ అంటూ పోసాని కృష్ణమురళి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి