
తన పెళ్లి గురించి వచ్చిన రూమర్ల వల్ల తనకు ఎంత లాభం కలిగిందో చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఒక చిన్న పుకారు ఒక మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా అనుబంధం ఉందంటే చాలు.. అది క్షణాల్లో దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.
తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఆ ‘సీతారామం’ భామకు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో ఆమె ప్రేమలో ఉందని, ఫిబ్రవరి 14న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఆ అందాల నటి మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. తన పెళ్లి వార్తలపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ తన పెళ్లి పుకార్ల గురించి చాలా సరదాగా మాట్లాడింది. “నిజం చెప్పాలంటే, నేను 3 కోట్లు, 6 కోట్లు లేదా ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక పీఆర్ (PR) టీమ్ ను పెట్టుకున్నా నాకు ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. నా గురించి, ధనుష్ గురించి ఎవరో కావాలని పుకార్లు పుట్టించారు. కానీ ఆ పుకార్ల వల్ల నా పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది. ఇలాంటి పబ్లిసిటీ నాకు ఫ్రీగా ఇచ్చినందుకు ఆ రూమర్లు పుట్టించిన వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.
Mrunal And Dhanush
మృణాల్, ధనుష్ కలిసి ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్లో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిని చూసిన కొందరు ఉత్సాహవంతులు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, వాలెంటైన్స్ డే నాడు వివాహం చేసుకోబోతున్నారని కథలు అల్లారు. దీనిపై మృణాల్ స్పందిస్తూ.. “వారి లెక్క ప్రకారం అయితే ఈపాటికి మా పెళ్లి కూడా అయిపోయి ఉండాలి. షూటింగ్ లో కలిసినప్పుడు మాట్లాడుకుంటే పెళ్లి చేసేస్తారా?” అని ప్రశ్నించింది.
ప్రస్తుతం తనకంటూ ఒక సొంత పీఆర్ టీమ్ లేదని మృణాల్ వెల్లడించింది. తన ఇంటి అడ్రస్ కూడా ఇప్పుడు పబ్లిక్ అయిపోయిందని, ఇలాంటివి చక్కదిద్దడానికి త్వరలోనే ఒక ప్రొఫెషనల్ టీమ్ ను ఏర్పాటు చేసుకుంటానని చెప్పింది. తన వ్యక్తిగత విషయాల కంటే తన సినిమాలు వార్తల్లో ఉండాలని ఆమె కోరుకుంటోంది. రూమర్లు ఎలా ఉన్నా మృణాల్ ఠాకూర్ కెరీర్ మాత్రం జోరుగా సాగుతోంది.
ఆమె నటించిన హిందీ సినిమా ‘దీవానే సెహర్ మే’ ఫిబ్రవరి 20న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో అడివి శేష్ సరసన నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల ప్రమోషన్ల సమయంలోనే ధనుష్తో పెళ్లి వార్తలు రావడం ఆమెకు ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. సెలబ్రిటీల జీవితంలో పుకార్లు అనేవి ఒక భాగం. కానీ వాటిని చూసి కుంగిపోకుండా, ఇంత పాజిటివ్గా స్పందించి వాటిని తన సినిమాల పబ్లిసిటీకి వాడుకోవడం ఒక్క మృణాల్ కే చెల్లింది.