
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణంతో మ్యూజిక్ ప్రపంచం మూగబోయింది. శనివారం మైసూర్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు జానకి. ఆమె మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జానకి తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను, ముఖ్యంగా దివంగత నటి సావిత్రితో తన అనుభవాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె తన అద్భుతమైన గాన శైలిలోని ప్రత్యేకతలను, సంగీత ప్రపంచంలో ఎదురైన సవాళ్లను వివరించారు. తన పాటలలోని స్పాంటేనియస్ గమకాలు, మాడ్యులేషన్స్ గురించి జానకి గారు మాట్లాడుతూ.. అవి ఎవరూ నేర్పినవి కావని, రికార్డింగ్ సమయంలో సహజంగానే వస్తాయని అన్నారు. అలాగే పాటలలోని భావ వ్యక్తీకరణకు మాడ్యులేషన్ ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఇటువంటి అంశాలు గాయనీ గాయకుల సొంత ప్రతిభకు నిదర్శనమని, దీనివల్లే పాటకు జీవం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
తన కెరీర్లో మొదటి తమిళ పాట, నీలగిరి చిత్రంలోని శృంగార వేలనేదేవే గురించి జానకి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పాటను మొదట లతా మంగేష్కర్ గారితో పాడించాలని భావించి, బాంబేకి తీసుకెళ్లారని, అయితే వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. సంగీత దర్శకుడు నీలయ్య గారు తనను సంప్రదించినప్పుడు, జానకి గారు ఆ పాటను కేవలం స్వరాలు పాడుకోకుండా రాగంగా పాడితే బాగుంటుందని సూచించారు. ఈ సూచనను సంగీత దర్శకుడు అంగీకరించడమే కాకుండా, చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారని జానకి గారు గుర్తుచేసుకున్నారు. డోలు, నాదస్వరం వంటి వాయిద్యాలతో కూడిన ఆ పాట ట్రాక్ ను మొదటగానే సిద్ధం చేశారని ఆమె తెలిపారు. ఈ పాట రికార్డింగ్ లో పాల్గొన్న ప్రొడ్యూసర్లు, లిరిక్ రైటర్ కుమార బాలసుబ్రహ్మణ్యం, సుబ్బయ్య నాయుడు, సావిత్రి, జెమినీ గణేశన్ వంటి ప్రముఖులందరూ నేడు లేరని, ఈ పాటతో సంబంధం ఉన్న వ్యక్తులలో తాను మాత్రమే జీవించి ఉన్నానని జానకి గారు భావోద్వేగంతో చెప్పారు. ఈ పాట తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు ఆరుద్ర గారు అద్భుతమైన సాహిత్యం అందించారని, అది కూడా గొప్ప విజయం సాధించిందని ఆమె తెలిపారు.
దివంగత నటి సావిత్రి పాటల ఎంపికపై కూడా జానకి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సావిత్రి ఎక్కువగా పి. సుశీల గాత్రానికే ప్రాధాన్యత ఇచ్చేవారని, అంతకుముందు పి.లీల గారు సావిత్రి కోసం “మాయాబజార్”, “మిస్సమ్మ”, “పెళ్ళిచేసి చూడు” వంటి చిత్రాలలో పాడారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో, టి.ఆర్. పాప సంగీత దర్శకత్వంలో తాను పాడిన ఒక మెలోడియస్ పాటను సావిత్రి తనకు వద్దని, సుశీల గారే పాడాలని కోరడంతో, జానకి గారు చాలా బాధపడ్డారు. ఈ సంఘటనతో సావిత్రి కోసం పాడనని జానకి గారు నిర్ణయించుకున్నారు. అయితే, “మురిపించే మువ్వలు” పాట విషయంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగిందని ఆమె వివరించారు. కమలా లక్ష్మణ్ డాన్స్ చేసిన ఈ పాట కోసం దాదాపు రెండు నెలల పాటు జానకి గారు పాడటానికి నిరాకరించారు. ఆఖరికి, సావిత్రి కోసం ఈ పాటను పాడడానికి అంగీకరించారు, సావిత్రి కూడా అందులో నటించారు అని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి