Taraka Ratna alekhya reddy: ‘మీ గుండెల్లోని బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు’.. తారకరత్న భార్య భావోద్వేగ పోస్ట్..

|

Mar 18, 2023 | 9:28 PM

పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది. తన భర్తతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తారకరత్న జ్ఞాపకాలను షేర్ చేస్తుంది. తాజాగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.

Taraka Ratna alekhya reddy: మీ గుండెల్లోని బాధను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.. తారకరత్న భార్య భావోద్వేగ పోస్ట్..
Tarakaratna
Follow us on

ప్రేమ.. పెళ్లి .. వీరిద్దరి జీవితంలో అనేక సంఘర్షణలను సృష్టించాయి. కలిసి జీవించేందుకు అయినవారందరికీ దూరమయ్యారు. అయినా మనసులో భరించలేని బాధను చిరునవ్వుతో దాచేస్తూ కొత్త జీవితం ప్రారంభించారు నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డి. వీరికి కూతురు నిషిక.. కవలలు తాన్యారామ్, రేయా జన్మించారు. ఓవైపు సినీ పరిశ్రమలో కొనసాగుతూనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తారకరత్న. ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులకు దగ్గరవుతున్న సమయంలో అర్థంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. నందమూరి తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు శివరాత్రి రోజునే (ఫిబ్రవరి 18న) తుదిశ్వాస విడిచారు. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అకాల మరణంతో తారకరత్న భార్య అలేక్య రెడ్డి బాధ వర్ణణాతీతం. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగుకుని గుండె నిండా భారంతో క్షణమొక యుగంలా జీవిస్తోంది. తన భర్తతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తారకరత్న జ్ఞాపకాలను షేర్ చేస్తుంది. తాజాగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.

“నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు నా మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం. మీతో నా పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. మన ప్రయాణంలో పెళ్లి నిర్ణయం నుంచే మీరు చాలా పోరాడారు. మొదటి నుంచి ఎంతో పోరాడావు. చివరకు మనం పెళ్లి చేసుకున్నాము. మన వివాహం ఒక గందరగోళం సృష్టించింది. మనపై వివక్ష… అయినా నువ్వు నాతోనే ఉన్నావు. ఆరోజు నుంచి ఇప్పటివరకు మీతో నేను సంతోషంగా ఉన్నాను.

నిషికమ్మ పుట్టిన తర్వాత మన జీవితం చాలా మారిపోయింది. మన సంతోషం రెట్టింపు అయ్యింది.. కానీ బాధలు మాత్రం అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్నితప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలుల కనేవాడివి. 2019లో మనకు కవలలు జన్మించారు. దీంతో నీ కల నిజమైందని ఎంత సంతోషించావో ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇన్నేళ్లూ ఎంతో పోరాటం చేశారు. చివరి వరకు మీరు పోరాడుతూనే ఉన్నారు.

మీ గుండెల్లో మోస్తున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు.. చూడలేరు. అది ఎన్నోసార్లు మిమ్మల్ని చంపేస్తుంది. మనకు కావాల్సినవాళ్లే మన మనసుకు పదే పదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మన ప్రయాణం మొదటి నుంచి చివరకు సపోర్ట్ గా ఉన్నవారిని కూడా మనం చాలాకాలం క్రితమే కోల్పోయాం. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం. నువ్వు ఎప్పటికీ రియల్ హీరో. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం ఓబు. మిమ్మల్ని మళ్లీ కలవాలని.. మీతో మరోసారి ప్రయాణించాలని ఆశిస్తున్నాను ” అంటూ తారకరత్నతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.