టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వివాదంపై పరిష్కారం వచ్చేసిందా?

టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వివాదంపై పరిష్కారం.. పెద్ది వరకేనా, లేక అసలు సమస్య ఇంకా మిగిలే ఉందా? ఆల్‌మోస్ట్.. సొల్యూషన్ వచ్చేసిందని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. బట్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం 'కొన్ని కష్టాలున్నాయ్' అంటోంది. పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ అడిగింది. ఓవైపు.. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవే హామీ ఇచ్చాక.. ఈ ఇష్యూ ఇంకా ఎందుకని కంటిన్యూ అవుతోంది.

టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?  రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వివాదంపై పరిష్కారం వచ్చేసిందా?
Tollywood

Updated on: May 28, 2026 | 8:47 PM

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఇప్పటి వరకు అమలవుతున్న రెంటల్ సిస్టమ్‌ను ఇక ఆపేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు. తమకు కావాల్సింది రెంట్ కాదు.. సినిమా కలెక్షన్లలో వాటా అనేది ఎగ్జిబిటర్ల డిమాండ్. ఇప్పటికిప్పుడు పర్సంటేజీ ఇవ్వాలంటే కుదరదు.. టైమ్ కావాలనేది ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఆన్సర్. అంత సమయం ఇచ్చేదే ఇచ్చేదే లేదు.. ఈ క్షణం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే, లేదంటే సింగిల్ స్క్రీన్లపై షోలు పడవు అని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. ఈ మొత్తం వివాదం.. త్వరలోనే రిలీజ్‌కు రెడీగా ఉన్న పెద్ది సినిమాపైనే ఫస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నెన్ని మీటింగ్స్ జరిగాయో. మీటింగ్స్‌లో ఓ పెద్ద సిరీస్ నడిచింది. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు రెండుసార్లు భేటీ అయ్యారు. చిరంజీవితో రెండు సిట్టింగ్స్ నడిచాయి. పవన్ కల్యాణ్‌తో ఒక భేటీ అయింది, మరో భేటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవినే చూస్తున్నారు కాబట్టి.. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఆయన ఇంటికే వెళ్లారు. రెండోసారి కూడా చిరంజీవిని కలిసి మాట్లాడి, తమ సమస్యకు పరిష్కారం రాబట్టుకున్నారు. ఆ సొల్యూషన్ ఏంటంటే.. జూన్ 30 తరువాత నుంచి సింగిల్ స్క్రీన్లకు రెంటల్ సిస్టమ్ ఉండదు, సినిమా కలెక్షన్లలో పర్సంటేజ్ మాత్రమే అమలవుతుంది అని ఎగ్జిబిటర్లకు చిరంజీవి హామీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది సినిమా టికెట్ రేట్లు పెంచితే.. సింగిల్ స్క్రీన్లకు రెంట్‌తో పాటు ఆ పెరిగిన టికెట్ ధరలో 7.5 శాతం పర్సంటేజ్ కూడా ఇవ్వాలని ఓ నిర్ణయానికొచ్చేశారు. ఈ సొల్యూషన్ ఇప్పటి వరకే. జూన్ 30 వరకే. ఎగ్జిబిటర్లకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది కమిటీ డిసైడ్ చేస్తుంది కాబట్టి అంత వరకు ఓపిక పట్టమన్నారు చిరంజీవి. ఆ కమిటీ కూడా ఆలస్యం చేయకుండా జూన్ 30 తేదీలోనే పర్సెంటేజ్ సిస్టమ్‌ను ప్రకటిస్తుందని కూడా చెప్పారు. ఇటు ఎగ్జిబిటర్లు కూడా కమిటీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చిరంజీవి మాట ఇచ్చి వచ్చారు.

ఇలా జరుగుతుండగానే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరికి వెళ్లారు సినీ నిర్మాతలు. పవన్ రాజమండ్రిలో ఉంటే.. నేరుగా అక్కడికే వెళ్లి సమస్యను ప్రస్తావించారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పవన్ కల్యాణ్ కూడా హామీ ఇచ్చారు. పర్సంటేజ్ విధానంతో సింగిల్ స్క్రీన్స్ నిజంగానే నిలబడతాయన్నది పవన్ కల్యాణ్‌కు నిర్మాతలు చెప్పిన మాట. ఒక విధంగా ఇష్యూ ఇక్కడితో పుల్ స్టాప్ పడ్డట్టే. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ఫిలిం చాంబర్ లేఖ రాసింది. ఇండస్ట్రీలో సమస్యలున్నాయ్, వాటిపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరింది చాంబర్. మరోవైపు సింగిల్ స్క్రీన్ సమస్యకు పరిష్కారం దొరికేసింది కదా అనేది ఎగ్జిబిటర్ల వాదన. ఉన్నట్టుండి ఫిలిం ఛాంబర్.. పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ అడగడంపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దొరికిన పరిష్కారం కేవలం పెద్ది వరకేనా, లేక ఇందులో ఏమైనా ట్విస్టులు ఉంటాయా అని.

ఇదిలా ఉంటే.. తమ మధ్య వచ్చిన తగువును పెద్దల దగ్గరికి వెళ్లి పరిష్కరించుకుంటున్నారు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు. కాని, దీన్ని తప్పుబడుతూ స్టేట్‌మెంట్ ఇచ్చారు సీపీఐ నారాయణ. ఇంత పెద్ద ఇండస్ట్రీకి వచ్చిన సమస్యకు చిరంజీవి ఇంట్లో పరిష్కారం వెతకడం ఏంటనేది నారాయణ అభ్యంతరం. చిరంజీవి ఇంట్లో సమావేశాలు పెట్టి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పైగా.. ప్రత్యేక షోలు అంటూ సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటి వరకైతే.. జూన్ 30 వరకు సమస్య పరిష్కారం అయినట్టే. ఆ తరువాత కూడా రెంటల్ సిస్టమ్ ప్లేస్‌లో పర్సంటేజ్ విధానం వచ్చేస్తుందని చిరంజీవి హామీ ఇచ్చేశారు. బట్.. కమిటీ ఏం ఫైనల్ చేస్తుందనేదే ప్రస్తుతానికి సస్పెన్స్.

Follow Us