
ఆహుతి ప్రసాద్.. తెలుగు సినిమా ఆడియెన్స్ కు ఈ నటుని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న సహాయక నటుల్లో ఆహుతి ప్రసాద్ కూడా ఒకరు. కేవలం సహాయక నటుడిగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గానూ మెప్పించారాయన. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆహుతి ప్రసాద్. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. హీరో, హీరోయిన్లకు తండ్రిగా, అన్నగా, మామగా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోయారాయన. 1986లో అక్కినేని నాగార్జున నటించిన మొదటి చిత్రం విక్రమ్ తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు ప్రసాద్. ఈ సినిమా విజయం సాధించినా ప్రసాద్ కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ మరుసటి ఏడాదిలోనే డాక్టర్ రాజశేఖర్ హీరోగా డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆహుతి చిత్రం ప్రసాద్ సినిమా జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో అతను పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. దీంతో తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. దీని తర్వాత ఆయన వెనుదిరిగా చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
టూ టౌన్ రౌడీ, ముద్దుల మావయ్య, బాలచంద్రుడు, అసెంబ్లీ రౌడీ, ఘరానా మొగుడు, నిన్నే పెళ్లాడతా, చూడాలని ఉంది, గణేష్, స్వయం వరం, సమర సింహారెడ్డి, సీతయ్య, సూర్య వంశం, కలిసుందాంరా, ఇంద్ర, చందమామ, లెజెండ్, అరుంధతి.. ఇలా తెలుగులో దాదాపు 117 చిత్రాల్లో నటించారు ఆహుతి ప్రసాద్. కేవలం నటునిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యారీ సీనియర్ నటుడు. తన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా అందుకున్నారాయన.
అయితే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు ఆహుతి ప్రసాద్. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన చివరికి 2015 జనవరి 4న తుది శ్వాస విడిచాడు. అప్పటికింకా ఆయనకు కేవలం 57 ఏళ్లు మాత్రమే. ఆహుతి ప్రసాద్ కుటుంబం విషయానికి వస్తే .. ఆయనకు ఇద్దరు కొడుకులు. కార్తీక్ ప్రసాద్, భరణి ప్రసాద్. ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ ప్రసాద్ తెలుగులో మంచి నటుడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లోనటించాడు. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.