
చిరంజీవి ఫ్లాప్ సినిమా కూడా కాకినాడలో ఏకంగా 175 రోజులు హౌస్ఫుల్గా నడిచిన అరుదైన ఘనతను శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. ఈ విజయ పరంపరను గమనించిన అల్లు అరవింద్, 1987లో “పసివాడి ప్రాణం” సినిమాతో ఈస్ట్ గోదావరి జిల్లాలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించారని వివరించారు. ఆ తర్వాత 1991లో “రౌడీ అల్లుడు” చిత్రంతో నైజాంలో కూడా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ విస్తరించినట్లు తెలిపారు. “స్టేట్ రౌడీ” కలెక్షన్లు ట్రేడ్ను ఆశ్చర్యపరిచాయని, నైజాంలో చిరంజీవి స్టామినాను అప్పుడే గుర్తించారని అన్నారు. చిరంజీవి చిత్రాలకు ఉన్న డిమాండ్ను వివరించడానికి, ఒక సెంటర్లో మెయిన్ థియేటర్లో సినిమా ఫుల్ అయినప్పుడు, ఓవర్ఫ్లోస్ తట్టుకోలేక పక్కనే ఉన్న మినీ థియేటర్లో సైతం షోలు వేసేవారని, అవి కూడా తక్షణమే నిండిపోయేవని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఈ ప్రభంజనం చిరంజీవికి మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే రిక్షావోడు సినిమా ఫ్లాప్ అయినా ఏకంగా 175 రోజులు ఆడిందని తెలిపారు.
1996లో, చిరంజీవి కొత్త సినిమాలు విడుదల కానప్పుడు (1995 డిసెంబర్లో విడుదలైన “రిక్షావోడు” ఫ్లాప్ అయిన తర్వాత), ఆయన పాత సినిమాలు మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి కూడా రీ-రిలీజ్లలో హౌస్ఫుల్గా ఆడాయని, ఇది ఆయన స్టార్డమ్కు నిదర్శనమని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఐదు ఆటలు (మార్నింగ్, నూన్, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షో) ఉండేవి. ఇతర హీరోల సినిమాలకు నూన్ షోలో వేరే పాత సినిమాలను వేసేవారు. కానీ చిరంజీవి చిత్రాలకు ఐదు ఆటలూ ఆయన సినిమానే ఉండేదని తెలిపారు.
చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు ఐదారు రెట్లు ఎక్కువ లాభాలు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. హీరోకు “స్మాల్ కట్” వెళ్తే, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు “వెరీ బిగ్ కట్” ను పొందేవారని విశ్లేషించారు. ఈ విషయం గ్రహించిన తరువాతి తరం హీరోలు రెమ్యునరేషన్ కంటే బిజినెస్లో షేర్, లాభాల్లో వాటా అడగడం ప్రారంభించారని తెలిపారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటి వారు నేడు తెలుగు సినిమా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇది కార్పొరేట్ వ్యవస్థగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి