Tollywood: ఆ మూవీ కోసం సునీల్కు ఐదు సినిమాల రెమ్యునరేషన్ ఇస్తానన్నా.. ఓపెన్గా చెప్పేసిన దర్శకుడు
దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మనసంతా నువ్వే చిత్రం కోసం సునీల్ని ఎంపిక చేసిన తీరు, డేట్స్ కోసం పడిన కష్టం, రీమా సేన్ను గ్లామర్ లేని పాత్రలో చూపించే సాహసం, తనికెళ్ళ భరణి విలనిజం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మనసంతా నువ్వే చిత్రం విషయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, సునీల్, రీమాసేన్, తనికెళ్ళ భరణి లాంటి కీలక నటీనటుల ఎంపిక ప్రక్రియ, దానికి సంబంధించిన సవాళ్లను వివరించారు. సునీల్ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమైందని ఆదిత్య వెల్లడించారు. మనసంతా నువ్వే సినిమాతోనే సునీల్కి పెద్ద స్టార్డమ్ వచ్చిందని పేర్కొన్నారు. సునీల్ను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం రవీంద్రభారతిలో కార్గిల్ వార్ నేపథ్యంతో భిక్షు గారి ట్రూప్లో ఆయన చేసిన మైమ్ అని దర్శకుడు తెలిపారు. ఒక డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతో ఒక తీవ్రమైన ఎమోషనల్ సబ్జెక్ట్ను సునీల్ అద్భుతంగా ప్రదర్శించారని చెప్పారు.
అప్పటికే ఎం.ఎస్. నారాయణ, చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకు అనేక మంది స్టార్లకు ఫ్రెండ్గా నటిస్తున్నారని, ఆ మొనాటనీని బ్రేక్ చేసి సినిమాకు ఫ్రెష్నెస్ను తీసుకురావడానికి సునీల్ను ఎంచుకున్నానని వివరించారు. అప్పట్లో సునీల్ ఒకేసారి ఐదు సినిమాలకు షూటింగ్ చేస్తున్నారని, తన సినిమా కోసం 20 రోజులు డేట్స్ ఇవ్వమని, ఆ ఐదు సినిమాల రెమ్యూనరేషన్ను కూడా తానే చెల్లిస్తానని బతిమలాడినట్లు తెలిపారు. సునీల్ను సినిమాలో ఉంచడానికి తాను చేయగలిగినదంతా చేశానని, ఇది సినిమాకు, ఆయనకు, తనకు అందరికీ పెద్ద ప్లస్ అయ్యిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
హీరోయిన్ రీమాసేన్ ఎంపిక, ఆమె పాత్ర కూడా సవాళ్లతో కూడుకున్నదని ఆదిత్య వెల్లడించారు. మనసంతా నువ్వేలో రీమాసేన్కు ఎలాంటి గ్లామరస్ పాటలు లేవని.. ఆమెను గర్ల్ నెక్స్ట్ డోర్గా, పద్ధతిగా, చుడీదార్లలో చూపించాలనుకున్నానని, ఎక్కడా స్కిన్ షో లేని క్యారెక్టర్ను చేయించడం మిస్ఫైర్ అవుతుందేమో అని ఆందోళన చెందానని తెలిపారు. అయితే, నిర్మాత ఎం.ఎస్. రాజు రీమాసేన్, తనూరాయ్ ఇద్దరి విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని, వారి ఎంపిక ఆయనదేనని చెప్పారు. నిర్మాత మాటతో, స్క్రిప్ట్ను మార్చకుండా ముందుకు వెళ్ళి, రీమాసేన్తో ఆ పాత్ర చేయించగా ఆమె చాలా బాగా నటించిందని దర్శకుడు ప్రశంసించారు.
తనికెళ్ళ భరణి విలనిజం ఈ సినిమాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ అని ఆదిత్య అన్నారు. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్గా, మంచి గవర్నమెంట్ ఆఫీసర్గా కనిపించిన ఆయన పాత్ర గురించి వివరిస్తూ, అప్పట్లో ఉన్న ఛాయిస్లలో అహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి ఉన్నారని చెప్పారు. అహుతి ప్రసాద్ను చూడగానే విలన్గా అనిపిస్తారని, కానీ తనికెళ్ళ భరణిలో మంచివాడు లేదా చెడ్డవాడు అనే ఒక ఎడ్జ్ ఉందని, అది ఈ పాత్రకు సరిగ్గా సరిపోయిందని అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్లో హీరోను పొడిచినప్పుడు, తన కూతురిని తీసుకురమ్మన్నానే తప్ప చంపమని చెప్పలేదని భరణి షాక్ అయ్యే సీన్ను అద్భుతంగా చిత్రీకరించారని, ఈ పాత్రకు ఆయన ఆ ఎడ్జ్ను కరెక్ట్గా పట్టుకున్నారని వి.ఎన్. ఆదిత్య మెచ్చుకున్నారు. సెకండాఫ్లో మెట్ల మీద కూర్చుని కూతురితో మాట్లాడే సీన్ తనకు ఒక డైరెక్టర్గా బాగా ఇష్టమైన సీన్లలో ఒకటని కూడా ఆదిత్య వెల్లడించారు.
