
మనిషి పుట్టుక ఒక నిర్దిష్ట కార్యం కోసమే అని, ఆ కార్యసాధనకే జీవితం అంకితమైందని దర్శకుడు తేజ అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధానం, మానవ బలహీనతలను వివరించారు. తన జీవితంలో ఎదురైన ఒక కీలక సందర్భాన్ని ఉదాహరణగా చెప్తూ, నిత్యానంద స్వామితో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. తన కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అది మరింత సీరియస్ గా మారింది. ఈ సమయంలో ఎవరో ఓ వ్యక్తి నిత్యానంద స్వామి బాబు ఆరోగ్యాన్ని సెట్ చేస్తారని, అతను తగ్గిస్తాడని, అయితే లక్ష రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చి చూస్తారని సలహా ఇచ్చాడట. కుమారుడి ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనతో, సాధారణంగా ఇలాంటి విషయాలను నమ్మకపోయినా, ఆ క్షణంలో వేరే మార్గం లేకపోవడంతో నిత్యానంద ట్రస్ట్కు లక్ష రూపాయల చెక్ ఇచ్చారట తేజ.
ఆతర్వాత నిత్యానంద ఇంటికి వచ్చి తేజ కొడుకును చూశారు. ఇంట్లో ఉన్న పనమ్మాయి సైతం ఆయన కాళ్ళ మీద పడిపోవడం చేస్తుందట, తేజ దూరం నుంచి వాటన్నిటినీ గమనిస్తున్నారట. నిత్యానంద వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఆ చెక్ బౌన్స్ అయింది. ఇది తెలిసి తేజ భార్య ఆయనను తిట్టిందట.. ఒక చెక్కు ఇవ్వబోయి మరో చెక్ ఇచ్చి ఉంటా.. అని మరో చెక్ ఇచ్చారట.. కొన్నిరోజుల తర్వాత అది కూడా బౌన్స్ అయింది. అకౌంట్ లో డబ్బులు లేవేమో అని ఈసారి డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయడానికి వెళ్తుండగా, ఫోన్ లో మెసేజ్ వచ్చింది. దాంట్లో నిత్యానందపై వచ్చిన వార్తలు చూసి షాక్కు గురయ్యారట తేజ. నిత్యానంద వివాదాల్లో చిక్కుకున్నాడని, అతడు దొరికాడని వార్తలు రావడంతో ఆయన వెనక్కి వచ్చేశారట. కష్టార్జితం కాబట్టి ఆ డబ్బులు దక్కాయని, లేకపోతే పోయేవని ఆయన భావించారట.
ఈ సంఘటన మనిషి జీవితంలో సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవనే వాస్తవాన్ని తేజ అన్నారు. వసుదేవుడు కూడా గాడిద కాళ్లను పట్టుకున్నాడని చెప్పినట్లు, మనిషి అవసరం అయితే ఎవరి కాళ్ళనైనా పట్టుకుంటాడు, మతాలను కూడా మార్చుకుంటాడు అని ఆయన అన్నారు. మన చేతిలో లేని సమస్యలను ఎదుర్కొనేటప్పుడు తెలివైనవారు, తెలివి తక్కువవారు అనే భేదం ఉండదని, అందరూ పరిష్కారం కోసమే చూస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ అనుభవం ద్వారా జీవితంలో వచ్చే సమస్యలను మరింత ప్రశాంతంగా ఎదుర్కోవచ్చని ఒక గుణపాఠం నేర్చుకున్నానని దర్శకుడు తేజ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి