
స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. అప్పుడెప్పుడో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోతున్నారు పూరి. ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ సినిమాతో రానున్నారు. ఈ సినిమా కోసం పూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్ ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు పూరి జగన్నాథ్ స్టార్ బాలకృష్ణతో తన అనుబంధాన్ని, అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాలకృష్ణ పట్ల తనకు అమితమైన ఇష్టం ఉందని పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఆయనతో రోజూ గడపడం, మాట్లాడటం తనకు చాలా ఇష్టం అని తెలిపారు. బాలకృష్ణ షూట్లో లేని రోజులలో సెట్ వాతావరణం నిరుత్సాహంగా ఉండేదని పూరి తెలిపారు. అలాంటి హీరోను నేను చూడలేదు. పోర్చుగల్లో జరిగిన షూటింగ్ అనుభవాలను వివరిస్తూ, బాలకృష్ణ క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తారని పూరి పేర్కొన్నారు. బాలకృష్ణ ఉదయం 4:30 గంటలకే అందరినీ లాబీకి వచ్చేయాలని చెప్పేవారని, షూటింగ్ ఉదయం 8 గంటలకు ఉన్నప్పటికీ అందరం 4:30 రెడీగా ఉండేవాళ్ళం అని పూరి చెప్పారు. షూటింగ్ సమయంలో బాలకృష్ణ తన తండ్రిని వంద సార్లకు పైగా స్మరించుకునేవారని పూరి తెలిపారు. బాలకృష్ణ తన తండ్రిని అంతగా స్మరించుకోవడం చూసి, తానుతన తండ్రిని తాను అంత తరచుగా గుర్తు చేసుకోకపోవడం బ్యాడ్ గా అనిపించిందని తెలిపారు పూరిజగన్నాథ్
బాలకృష్ణ నిజంగా గొప్ప వ్యక్తి అని పూరి జగన్నాథ్ ప్రశంసించారు.పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీట్లో పూరి మాట్లాడుతూ.. బాలకృష్ణతో పనిచేయడం గొప్ప అనుభవమని, ఆయన క్రమశిక్షణ, నిబద్ధత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పూరి పేర్కొన్నారు. బాలకృష్ణ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా, అసిస్టెంట్ డైరెక్టర్లకు డైలాగులు చెప్పడంలో, కొరియోగ్రాఫర్లకు, ఫైటర్లకు మూమెంట్స్ నేర్పడంలోనూ సహాయపడతారని పూరి వివరించారు. నిర్మాత డబ్బు వృథా కాకూడదనే ఉద్దేశ్యంతో, వెలుతురు తగ్గుతుంటే వెంటనే షాట్ పూర్తి చేయాలని అందరినీ కోరి కెమెరా ముందు నిలబడే ఏకైక హీరో బాలకృష్ణ అని పూరి జగన్నాథ్ తెలిపారు. ఆయనకు సినిమా అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు కూడా హాజరయ్యారు పూరి. ఆ షోలో కూడా బాలయ్య పై తన అభిమానాన్ని చాటుకున్నారు. గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా, నాకు బాలయ్య బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చారు.
Balakrishna