
పొట్టి వీరయ్యది మన తెలంగాణనే. నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం ఆయన స్వస్థలం. తల్లి పేరు గట్టు నరసమ్మ. నాన్న పేరు గట్టు సింహాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. వీరయ్య ఉండే గ్రామంలోనే మంగళ్ గోపాల్ అనే వ్యక్తి సినిమాల్లో పెళ్లిళ్లకు డెకరేషన్ చేస్తుండేవాడు.. ఆయన సాయంతో 1967లో మద్రాస్లో అడుగుపెట్టారు వీరయ్య. అక్కడ ఓ పూల కొట్టులో పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకసారి శోభన్ బాబును వీరయ్య కలిశారు. ఆయన వీరయ్యను చూసి విఠలాచార్యగారిని కానీ, భావన్నారాయణగారిని కానీ కలవండి, మీలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చేది వాళ్లే అని సలహా ఇచ్చారట. శోభన్ బాబు మాట ప్రకారమే విఠలాచార్యగారిని కలిశారు వీరయ్య. ఆయన అతని ఆకారం నచ్చి తన సినిమాలలో పలు అవకాశాలు కల్పించాడు. వీరయ్య నటించిన తొలి చిత్రం అగ్గివీరుడు. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించారు. విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యను బాగా ప్రోత్సహించారు. ఆయన తొలి సినిమా తాతా మనవడులో అవకాశం కల్పించారు. దాసరి దర్శకత్వంలోనే వచ్చిన రాధమ్మపెళ్లి చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటించారు వీరయ్య.
టార్జాన్ సుందరి, జగన్మోహిని, పేదరాసి పెద్దమ్మ కథ, కృష్ణ గారడీ, యుగంధర్, గజదొంగ, అత్తగారి పెత్తనం, గోల నాగమ్మ, పాపే నా ప్రాణం, దేవి నాగమ్మ.. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు వీరయ్య. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, అక్కినేని, శివాజీగణేశన్ వంటి దిగ్గజాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక వీరయ్య భార్య పేరు మల్లిక. వీరికి ముగ్గురు సంతానం. అయితే 2008లో మధుమేహంతో బాధపడుతూ వీరయ్య భార్య కన్నుమూసింది.ఇక సుమారు ఐదేళ్ల క్రితం పొట్టి వీరయ్య కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. 2021 ఏప్రిల్ 25న తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అదే రోజు ఆయన తుది శ్వాస విడిచారు.
ఇక పొట్టి వీరయ్య చిన్న కూతురు విజయ దుర్గ కూడా గతంలో పలు సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడామె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తోంది. అందులో తన భర్తతో ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది విజయ దుర్గ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి