Dhee Pandu: ‘మా నాన్న ఆటోడ్రైవర్..’ ఢీ పండు నవ్వుల మాటున దాగున్న కష్టాలు

ఢీ షో ద్వారా ఫేమస్ అయిన పండు తన సంపాదన గురించి స్పందిస్తూ, తనకు సొంత ఇల్లు లేదని వెల్లడించారు. తన ఆదాయమంతా తన తల్లిదండ్రుల కోసమే ఖర్చు చేస్తున్నానని, తన ఆటో డ్రైవర్ తండ్రిని కొత్త ఆటో కొనమని అడిగినా పాత ఆటోనే వాడతారని తెలిపాడు. నేటి తరం తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తన అభిప్రాయాలను పండు పంచుకున్నారు.

Dhee Pandu:  మా నాన్న ఆటోడ్రైవర్.. ఢీ పండు నవ్వుల మాటున దాగున్న కష్టాలు
Dhee Pandu

Updated on: Jan 07, 2026 | 7:12 PM

‘ఢీ’ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పండు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక స్థితి, కుటుంబం గురించి, అలాగే నేటి సమాజంలో సంబంధాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. తన సంపాదన గురించి ప్రశ్నించినప్పుడు, ఆశ్చర్యకరంగా తనకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని పండు వెల్లడించారు. పండు తన సంపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం తన తల్లిదండ్రుల సంతోషమేనని స్పష్టం చేశారు. వారు తమ జీవితంలో ఎన్నడూ అనుభవించని విలాసాలను వారికి అందించాలని ఆయన కోరుకుంటున్నారు. ఉదాహరణకు, పెద్ద ఐమ్యాక్స్‌లో సినిమా చూపించడం, పాప్‌కార్న్ ఖరీదు ఎక్కువైనా సరే వారికి కొనివ్వడం వంటివి తాను చేస్తానని తెలిపారు. తన తల్లిదండ్రులు ఉన్నంతవరకు, వారిని ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూసుకోవడం తన ధ్యేయమని పండు పేర్కొన్నారు. ఇతరులు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని అనుకున్నా సరే, తన తల్లిదండ్రుల కోసమే ఇవన్నీ చేస్తానని ఆయన గట్టిగా చెప్పాడు.

పండు తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ, తన తండ్రి గత 20 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. తాను కొత్త ఆటో కొనిస్తానని చెప్పినా, తన సంపాదనతో కొన్న పాత ఆటోనే వాడుతానని, దాన్ని వదిలిపెట్టనని తన తండ్రి పట్టుదలతో ఉంటారని పండు వివరించాడు. నెలవారీ రిపేర్ ఖర్చులు పది వేల నుంచి ఇరవై వేలు వచ్చినా సరే, తన తండ్రి అదే ఆటోను నడపడానికి ఇష్టపడతారని పండు పేర్కొన్నాడు.

Also Read: ట్రైన్‌లో అడ్డా కూలీలు పెట్టిన అన్నంతో కడుపు నింపుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్

నేటి తరంలో కొందరు తమ తల్లిదండ్రులను వదిలివేయడం లేదా అనాథాశ్రమాలలో చేర్చడం వంటి వాటిపై పండు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేటి జీవనశైలి, విలాసాలకు అలవాటు పడటం వల్లే ఇటువంటి మార్పులు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పేరెంట్స్ తమ లైఫ్‌స్టైల్‌ను, టైమింగ్స్‌ను అర్థం చేసుకోలేరని భావించి, వారిని పక్కన పెట్టడం జరుగుతుందని పండు అభిప్రాయపడ్డాడు. స్నేహితులు, ప్రియురాళ్లు లేదా ప్రియులు ఎవరైనా ఒక సమయంలో దూరం కావచ్చు, కానీ కష్టాల్లో, అనారోగ్య సమయాల్లో తోడుండేది తల్లిదండ్రులు మాత్రమేనని ఆయన బలంగా చెప్పారు. వారి వయసు పైబడినప్పుడు కూడా, తమ పిల్లల కోసమే జీవిస్తారని పండు గుర్తు చేశారు. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది పరస్పర అవగాహన అని ఆయన సూచించారు.

తనకు ఇతరుల జీవితాల గురించి ఆలోచించడానికి సమయం లేదని.. తన జీవితం, తన సంపాదన మాత్రమే తన ప్రాధాన్యత అని చెప్పారు. పెళ్లి గురించి అడిగినప్పుడు, లైఫ్‌పార్ట్‌నర్‌ను ఎంచుకునే విషయంలో సమయం తీసుకోవడం, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని పండు పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఇప్పటికీ ఉందని, అయితే డబ్బు కోసం ఆశపడే ప్రేమ మాత్రమే తరచుగా బయటపడి, సమస్యలను సృష్టిస్తుందని, స్వచ్ఛమైన ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుందని పండు వివరించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us