
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆదివారం (జూన్ 18) గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు నివాళి అర్పించారు. ఇక సోషల్ మీడియాలోనూ అభిమానులు, నెటిజన్లు రాకేష్ మాస్టర్ మృతికి సంతాపం తెలియజేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా డ్యాన్స్ మాస్టర్ అంత్యక్రియలు నేడు (జూన్ 19) జరగనున్నాయి. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు రాకేష్ మాస్టర్ చివరి చూపు చూసుకోవడానికి వస్తున్నారు. ఈక్రమంలో మాస్టర్ శిష్యులు శేఖర్, జానీ మాస్టర్లు తమ గురువు కడసారి చూపుకోసం రాకేష్ మాస్టర్ ఇంటికొచ్చారు. ముందుగా శేఖర్ మాస్టర్ తన గురువు పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం నమస్కారం చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక జానీ మాస్టర్ కూడా తన గురువును కడసారి చూసుకుని ఎమోషనల్ అయ్యారు. వీరితో పాటు నగరంలోని రాకేష్ మాస్టర్ అభిమానులందరూ ఆయన చివరి చూసు కోసం ఇంటికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్స్ రాకేష్ మాస్టారి దగ్గరే డ్యాన్స్ పాఠాలు నేర్చుకున్నారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎందుకోగానీ రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయంపై శేఖర్ మాస్టర్ ఎప్పుడూ స్పందించలేదు కానీ కొన్ని సందర్భాల్లో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన గురువు కడసారి చూపుకోసం వస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే తన గురువు మరణవార్త తెలియగానే సోమవారం నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు శేఖర్ మాస్టర్. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.