Tollywoood: తన సినిమాతో చిరంజీవితో పోటీ పడ్డ నారాయణమూర్తి.. ఎవరు నెగ్గారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
1995లో రిక్షా కార్మికుల సమస్యలపై విడుదలైన చిరంజీవి రిక్షావోడు, ఆర్.నారాయణమూర్తి ఒరేయ్ రిక్షా చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు తన శిష్యుడు కోడి రామకృష్ణపై పైచేయి సాధించారు. భారీ అంచనాలతో వచ్చిన రిక్షావోడు నిరాశపరచగా, ఒరేయ్ రిక్షా ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి స్పోర్టివ్ నెస్ ప్రదర్శిస్తూ ఓటమిని అంగీకరించారు.

1995లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పోటీ చోటు చేసుకుంది. రిక్షా కార్మికుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రెండు చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి నటించిన రిక్షావోడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించిన ఒరేయ్ రిక్షా. ఈ రెండు చిత్రాలు కేవలం చిత్ర ప్రముఖులనే కాదు, ప్రేక్షకులను కూడా ఆకర్షించి, వాటి నిర్మాణ విశేషాలపై ఆసక్తిని రేకెత్తించాయి. ఒరేయ్ రిక్షా చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, రిక్షావోడు చిత్రానికి ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ గురుశిష్యుల పోటీని సినీ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఈ రెండు చిత్రాల్లో రిక్షావోడు చిత్రం షూటింగ్ ముందుగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రానికి నిర్మాత అయిన క్రాంతికుమార్, ఆయన శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత రిక్షావోడు చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా కోదండరామిరెడ్డిని అనుకున్నప్పటికీ, చివరి క్షణంలో జరిగిన మార్పుల వల్ల కోడి రామకృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రిక్షావోడు చిత్రంలో చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దాదాపు 15 నిమిషాల నిడివి గల తండ్రి ధర్మారాయుడు పాత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ పాత్రకు జయసుధ జోడీగా నటించారు. మెగాస్టార్ సరసన సౌందర్య తొలిసారిగా నటించిన చిత్రమిది. అంతేకాదు, ఆమె ఇందులో పూర్తి మాస్ క్యారెక్టర్ పోషించారు. మరో కథానాయికగా నగ్మా నటించారు.
రిక్షావోడు ప్రారంభమైన రెండు నెలలకు నారాయణమూర్తి నటించిన ఒరేయ్ రిక్షా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో నారాయణమూర్తి రిక్షా పుల్లర్ సూర్యంగా నటించారు. దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించిన తొలి చిత్రం ఇదే. నారాయణమూర్తి కట్టుబడి ఉన్న బాటలో, ఆయన ఇమేజ్కు తగ్గట్టుగా దాసరి ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్యం భార్యగా రవళి, అతని చెల్లెలుగా మధురిమ నటించారు. ప్రజా గాయకుడు గద్దర్ ఒరేయ్ రిక్షా చిత్రానికి పాటలు రాయడం ఒక విశేషం. సినిమాలో ఎనిమిది పాటలుంటే, అందులో ఆరు పాటలను గద్దర్ రాశారు. ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా గద్దర్ ఈ పాటలను అందించారు. ఇందులో “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా” పాట పెద్ద హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రిక్షా కార్మికుడి పాత్ర పోషించడంతో తమకు కన్నుల పండుగే అని మాస్ ఆడియన్స్ భావించారు. అన్నీ చక్కగా కుదిరాయని, విజయం గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్తో ప్రేక్షకుల ముందుకు వెళ్లిన రిక్షావోడు చిత్రానికి ఊహించని పరాజయం ఎదురైంది. అంచనాలు ఘోరంగా తలకిందులయ్యాయి. రెండు పాత్రల్లో మెగాస్టార్ అభినయం అందరినీ ఆకట్టుకున్నా, చిత్రంలోని మిగిలిన అంశాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఈ చిత్ర పరాజయం చిరంజీవిపై ఎంత ప్రభావం చూపిందంటే, ఆ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని అంతర్మధనంలో ఆయన ఎనిమిది నెలలు మేకప్కు దూరంగా ఉండిపోయారు. ఈ పోటీలో గురువు దాసరి నారాయణరావుదే పైచేయి అయింది. ఒరేయ్ రిక్షా ఘన విజయం సాధించి 175 రోజులు ఆడింది. 1996 మే 4న చెన్నైలో జరిగిన విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, “మా రెండు రిక్షాల మధ్య పోటీలో నారాయణమూర్తి రిక్షా ముందుకు దూసుకుపోయింది” అని వ్యాఖ్యానించి, తమ సినిమా పరాజయాన్ని అంగీకరించారు. మెగాస్టార్ ప్రదర్శించిన స్పోర్టివ్నెస్, తన ఓటమిని బహిరంగంగా అంగీకరించిన తీరుకు ఇది నిదర్శనం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
