NTR Centenary Celebrations: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజినీకాంత్.. సూపర్ స్టార్‌కు స్వాగతం పలికి నటసింహం

పోరంకిలో జరిగే ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన రజనీకాంత్‌కి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో నటుడు బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Updated on: Apr 28, 2023 | 12:26 PM

తమిళ సూపర్‌స్టార్‌, తలైవా రజనీకాంత్‌ విజయవాడ విచ్చేసారు. పోరంకిలో జరిగే ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన రజనీకాంత్‌కి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో నటుడు బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు.

మరోవైపు ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో ఎన్టీఆర్‌ అద్భుత ప్రసంగాలకు సంబంధించిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నటుడు రజనీకాంత్‌ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఎన్టీఆర్‌ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగురాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు.

అనుమోలు గార్డెన్స్‌లో నేడు ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

Follow Us