
హైదరాబాద్లో సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లేటెస్టుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ తర్వాత, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదనే విషయంలో క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీలో చెప్పినదానికే తాను కట్టుబడి ఉన్నానని, సినీ పెద్దలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఆ తర్వాత బడా నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారు. దాని మీద చర్చ జరగలేదని తేల్చేశారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు.
సంక్రాంతి రేసులో 3 భారీ సినిమాలు. ఈ సంక్రాంతి రేసులో 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ వస్తోంది. రామ్చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ రానుంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ విడుదల కానుంది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు, బెనిఫిట్ షోలకు నో చాన్స్ అని తేటతెల్లంగా తెలిసిపోయింది. మరి ఈ బడా సినిమాల పరిస్థితేంటి.? దానిపైనే నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో అక్కడి సర్కార్ సానుకూలంగా ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు. అయితే అక్కడ కూడా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు బెనిఫిట్ షోలు ఉండాలా?వద్దా అన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయనేతలు వరుసగా ఆ అంశంపై స్పందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెనిఫిట్ షోలపై మండిపడ్డారు ఏపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని.. కానీ ఇప్పుడు సినిమా నిర్మాతల కోసమే బెనిఫిట్షోలు వేస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటున్నారు ఏపీ ఎమ్మెల్యేలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి