
తెలుగు సినీ చరిత్రలో అమ్మోరు చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి రాజీ పడకుండా, అలుపెరగని కృషి, పట్టుదలతో ఈ చిత్రాన్ని నిర్మించి గ్రాఫిక్స్ చిత్రాల శకానికి నాంది పలికారు. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తుందనే విమర్శలు ఉన్నప్పటికీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. కష్టాల్లో ఉన్న ఒక భక్తురాలిని చిన్నారి రూపంలో అమ్మవారు ఎలా రక్షించింది అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా తర్వాతే తెలుగులో గ్రాఫిక్స్ చిత్రాల నిర్మాణం పెరిగింది. అమ్మోరు నిర్మాణం ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియ. శ్యాంప్రసాద్ రెడ్డి దాదాపు మూడన్నరేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్పై శ్రమించారు. ఈ సినిమా నిర్మాణానికి ముందు ఆయన తలంబ్రాలును 18 రోజుల్లో, ఆహుతిని 27 రోజుల్లో, అంకుశంను 110 రోజుల్లో పూర్తి చేశారు. కానీ అమ్మోరు చిత్రం కోసం ఏకంగా 400 రోజులకు పైగా షూటింగ్ జరపడం విశేషం. దీనికి ప్రధాన కారణం చిత్రాన్ని రెండుసార్లు, ఇద్దరు దర్శకులతో రూపొందించడమే.
మొదట, తమ సంస్థలో పల్నాటి సింహం చిత్రానికి కో-డైరెక్టర్గా పనిచేసిన వై. రామారావును దర్శకుడిగా ఎంపిక చేసుకుని 1992 జూలై రెండవ వారంలో తూర్పుగోదావరి జిల్లాలోని ముక్తేశ్వరం తాలూకా, అయినవిల్లి గ్రామంలో షూటింగ్ ప్రారంభించారు. అక్కడ, హైదరాబాద్లో 70 రోజుల పాటు జరిగిన షూటింగ్ తర్వాత ఒక జాతర, ఆ జాతరలో పాట మినహా మిగతా చిత్రం పూర్తయింది. సురేష్, సౌందర్య ముఖ్య జంటగా, చిన్నా విలన్గా, నాగమణి లేడీ విలన్గా నటించారు. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి లండన్ వెళ్లారు. స్పెషల్ ఎఫెక్ట్స్ పని పూర్తయిన తర్వాత రషెస్ చూసుకున్న శ్యాంప్రసాద్ రెడ్డికి సంతృప్తి కలగలేదు. తాను అనుకున్న విధంగా సినిమా రాలేదనిపించింది. దాంతో, అప్పటి వరకు తీసినదంతా పక్కన పెట్టేసి, మళ్లీ మొదటి నుంచి అమ్మోరు సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. ఈసారి ప్రధాన మార్పు దర్శకుడి విషయంలో జరిగింది. వై. రామారావు స్థానంలో కోడి రామకృష్ణకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అలాగే చిన్నా ప్లేస్లోకి రామిరెడ్డి విలన్గా వచ్చారు, నాగమణి పోషించిన గయ్యాళి అత్త పాత్రను వడివక్కరసి చేశారు. ఈసారి లండన్ నుంచి క్రిస్ స్టాన్లీ హోమ్స్ను పిలిపించుకొని, ఆయన హైదరాబాద్ వచ్చి ఏడాదిపాటు శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లోనే ఉండి గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. ఈ పట్టుదల, రాజీలేని స్వభావం సినిమా నాణ్యతను పెంచింది.
నటీనటుల విషయానికి వస్తే, సౌందర్య ఈ సినిమా కోసం 180 రోజులు పనిచేశారు. ఆమె తీసుకున్న పారితోషికం కేవలం 40 వేల రూపాయలు. సౌందర్య కెరీర్లో మూడో సినిమాగా మొదలైన అమ్మోరు, చివరికి ఆమె 27వ చిత్రంగా విడుదల అయ్యింది. సౌందర్య తండ్రి సత్యనారాయణ తన కూతురుకు ఎంతో పేరు వస్తుందని ఆనందపడ్డారు. అయితే ఆయన ఈ సినిమా చూడకుండానే కన్నుమూశారు. ఆయనపై గౌరవంతో శ్యాంప్రసాద్ రెడ్డి అమ్మోరు చిత్రాన్ని ఆయనకు అంకితం ఇచ్చారు. అమ్మోరుగా రమ్యకృష్ణ నటన పలువురి ప్రశంసలు పొందింది. అలాగే బేబీ సునయన పాత్రకు కూడా అద్భుతమైన స్పందన లభించింది. 1995 నవంబర్ 23న విడుదలైన అమ్మోరు ప్రేక్షకులకే కాదు, బాక్సాఫీస్కు కూడా పూనకం తెప్పించింది. హిందీ, తమిళ్, మలయాళ, ఒరియా, బెంగాలీ, భోజ్ పూరి వంటి అనేక భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించి, ప్రజాదరణ పొందింది. అమ్మోరు కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో గ్రాఫిక్స్ సాంకేతికతకు మార్గదర్శకం చేసిన ఒక అద్భుత ప్రయోగం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి