
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సుకన్య ఒకరు, కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకున్నారుఆమె. సుకన్య తండ్రి, తమిళ నిర్మాత రమేష్, ఆమె సినీ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. 1991లో భారతీరాజా దర్శకత్వం వహించిన పుదునెల్లు పుదు నాతు సినిమాతో తెరంగేట్రం చేసిన సుకన్య, అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగారు. రజినీకాంత్, విజయకాంత్ వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్నారు. నటనతో పాటు, కళాక్షేత్రంలో నాట్య ప్రదర్శనలు ఇస్తూ, ప్రముఖ నర్తకి చంద్రలేఖ డాన్స్ ట్రూప్తో కలిసి రష్యాలోని క్రెమ్లిన్ స్క్వేర్లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచెవ్ల ముందు ప్రదర్శన ఇచ్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
కెరీర్ పీక్స్లో ఉండగానే, 2002 మార్చి 18న అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ను ప్రేమ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, ఏడాది తిరిగేలోపే అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఆమె విడాకులకు, సినీ కెరీర్లో అవకాశాలు తగ్గడానికి వీరప్పన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక కారణమని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. అసలు ఏం జరిగిందంటే.. 1996లో నక్కీరన్ గోపాల్ అనే జర్నలిస్టుకు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో హీరోయిన్ సుకన్యకు వివాహేతర సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. 1996 లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపయోగించుకున్నారని కూడా ఆరోపణలు చేశారు.
అది కాస్త టీవీలో టెలికాస్ట్ అవ్వడంతో.. అది తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందని భావించిన సుకన్య, అప్పుడే సదరు టీవీ ఛానెల్ పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు దశాబ్దాల పాటు నడిచింది. కోర్టులో విచారణకు వచ్చిన ప్రతిసారీ, సుకన్య, వీరప్పన్, పీవీ నరసింహారావు కుమారుడి గురించి వార్తలు మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల కారణంగానే సుకన్య వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తి, పెళ్లైన సంవత్సరంలోపే విడాకులు తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. వీరప్పన్కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో సినీ పరిశ్రమ సుకన్యను సినిమాల్లోకి తీసుకోవడానికి వెనుకాడింది, దీంతో ఆమె సినీ అవకాశాలు తగ్గాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, సుకన్యకు ఫైనల్గా న్యాయం దక్కింది. 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆ టీవీ ఛానెల్ 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ఆ టీవీ ఛానెల్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా సుకన్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ప్రస్తుతం సుకన్య తల్లి పాత్రలు పోషిస్తూ, బుల్లితెరపై సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తెలుగులో పదేళ్ల క్రితం వచ్చిన శ్రీమంతుడు చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి