
శ్రీలక్ష్మి తన సోదరుడు రాజేష్ అకాల మరణం వెనుక దాగి ఉన్న విషాద భరితమైన విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాజేష్ కేవలం 38 ఏళ్ల వయసులోనే జీవితంపై విసుగు చెంది కన్నుమూసినట్లు శ్రీలక్ష్మి తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, తప్పుడు నిర్ణయాలు, తీవ్రమైన నిరాశల పర్యవసానమే అని ఆమె స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి తన కెరీర్ ప్రారంభంలో పుణ్యభూమి కళ్ళు తెరిచింది వంటి చిత్రాల్లో రెండవ హీరోయిన్గా నటించిన రోజుల నుంచి రాజేష్ కథను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో, రాజేష్ ఇండస్ట్రీలో నాగమణి అనే డాన్సర్తో ప్రేమలో పడి, కుటుంబానికి తెలియకుండానే ఆమెను వివాహం చేసుకున్నాడు. కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించనప్పటికీ, రాజేష్ పట్టుబట్టాడు. తన భార్యకు రాఘవేంద్రరావు, దాసరి వంటి ప్రముఖ దర్శకులతో పరిచయాలు ఉన్నాయని, తద్వారా తనకు మంచి హీరో అవకాశాలు వస్తాయని రాజేష్ నమ్మాడని శ్రీలక్ష్మి వివరించారు. కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఆశతో, తన అక్క కష్టాన్ని తగ్గించాలనే మంచి ఆలోచనతోనే రాజేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆమె పేర్కొన్నారు.
అయితే, రాజేష్ ఆశలు అడియాశలయ్యాయి. భార్య చెప్పిన విధంగా అతనికి పెద్ద అవకాశాలు రాలేదు. కనీసం చిన్న చిన్న పాత్రలకు కూడా సరైన మద్దతు లభించలేదు. దీంతో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని శ్రీలక్ష్మి తెలిపారు. రాజేష్ భార్య డాన్సర్గా పని చేసేది. అయితే, “మీ ఆవిడని పనికి పంపిస్తున్నావా.? నువ్వేమో ఇంట్లో కూర్చున్నావా.?” అని బయట నుంచి విమర్శలు రావడంతో రాజేష్ ఆమెను పనిలోకి పంపించడం ఆపేశాడు. ఈ పరిణామాలన్నీ రాజేష్ను తీవ్ర డిప్రెషన్లోకి నెట్టాయి. అతను మద్యపానానికి బానిసై, తన జీవితాన్ని పూర్తిగా ట్రాక్ తప్పించాడు.
“నేను మోసపోయాను, నా జీవితం పోయింది. నన్ను వదిలేయండి, నా గురించి ఆలోచించకండి” అని రాజేష్ చివరిగా కుటుంబ సభ్యులతో చెప్పిన మాటలను శ్రీలక్ష్మి గుర్తుచేసుకున్నారు. అతను మరో వివాహం చేసుకోవడానికి కూడా నిరాకరించాడని, తన జీవితం నాశనమైందని నమ్మాడని ఆమె తెలిపారు. రాజేష్ మరణం కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, జీవితంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే, అది మనిషిని జీవితాంతం వెంటాడుతుందని, అది రాజేష్ విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.