నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేశ్బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న #SSMB29లో ప్రతినాయకి పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె గత కొద్ది రోజులుగా ఇండియాలో ఉంటున్నారు. ఈ తరుణంలో ముంబయిలోని తన అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లను కొన్ని ఆమె అమ్మినట్లు ఇండెక్స్ ట్యాప్ తెలిపింది.
అంథేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్స్లోని ఫ్లాట్లకు డిమాండ్ బాగా ఉంది. అంతేకాదు, అవి అత్యంత ఖరీదైనవి కూడా. అక్కడ ప్రియాంకకు అత్యంత విలాసవంతమైన జోడీ యూనిట్ సహా నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని 16.17 కోట్ల రూపాయలకు విక్రయించారు. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్ ఉండగా, వాటిని రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు అమ్మేశారు. ఇక 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేశారట. మార్చి 3వ తేదీన ఇందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా కథనం ప్రకారం 2021లో వెర్సోవాలోని రెండు ఆస్తులను, 2023లో లోఖండ్వాలాలోని రెండు పెంట్ హౌస్లను కూడా ప్రియాంక ఇప్పటికే విక్రయించారు. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్లో సొంత భవనాలు ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలు, వెబ్సిరీస్లతో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా.. భర్త నిక్ జోనస్, కుమార్తె మేరీ చోప్రా జోన్స్ తో కలిసి లాస్ ఏంజెలెస్లో ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సిటడెల్’ అమెరికన్ సిరీస్లోనూ కీలక రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగులో రాజమౌళి తీస్తున్న #SSMB29లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. ఇందులో హీరో మహేశ్బాబు పేరు ‘రుద్ర’ అని టాక్.