
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. ఈ సినిమా తాజాగా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్) వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధానాంశంగా తీసుకుంది. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం అని మేకర్స్ చెప్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
టీజర్లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే న్యాయం కోసం పోరాడుతూ, పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని టీజర్ ఆవిష్కరించింది. భావోద్వేగాలతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కథతో, తరచూ మన దృష్టికి రాని ఒక కీలక సమస్యను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, “‘ది ఇండియా స్టోరీ’ బలమైన సామాజిక సందేశంతో రూపొందిన సినిమా. ఒక తల్లిగా ఈ కథ నాకు చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అయింది. నేటి తల్లిదండ్రులందరిలో ఉన్న ఆందోళనలు, భయాలను ఇది ప్రతిబింబిస్తుంది. టీజర్ ప్రజలకు తెలియని ఒక వాస్తవాన్ని చూపిస్తుంది. మనం తీసుకునే ఆహారం, అది భవిష్యత్ తరాలపై చూపే ప్రభావం గురించి ఈ సినిమా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి