Uday Kiran : చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి చెప్పిన మాటలు ఇవే.. ఉదయ్ కిరణ్ అక్క ఎమోషనల్..
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు. నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన రెండు చిత్రాలు సైతం ఊహించని రెస్పాన్స్ అందుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లోనే హ్యాట్రిక్ హిట్ అందుకుని ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. కానీ ఎంత త్వరగా ఉన్నత శిఖరాలకు ఎదిగాడో.. అంతే వేగంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉదయ్ మరణం తీరని లోటు.

ఉదయ్ కిరణ్.. తెలుగు సినీప్రియులు ఎప్పటికీ మర్చిపోని నటుడు. సినీరంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే హ్యాట్రిక్ హీరోగా తనదైన ముద్ర వేశారు. వరుస ప్రేమకథలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్రం, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత కెరీర్ లో వరుస ప్లాపులు, జీవితంలో ఒడిదుడుకులతో సూసైడ్ చేసుకున్నారు. ఉదయ్ ఆత్మహత్యతో యావత్ సినీ పరిశ్రమ షాకైంది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ కు సంబంధించిన ఏదోక విషయం ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఉదయ్ కిరణ్ కెరీర్ మలుపు తిప్పిన మనసంతా నువ్వే సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ అక్క శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఉదయ్ కిరణ్ చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే బలమైన కోరికను కలిగి ఉండేవాడని.. జీవితంలో ప్లాన్ బి అనే ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడూ ఆలోచించలేదని, కేవలం నటుడిగానే స్థిరపడాలని దృఢంగా నమ్మాడని శ్రీదేవి అన్నారు. తన తల్లిని ఒప్పించి, రామారావు ఫిల్మ్ సిటీ ఆడిషన్స్కు వెళ్లాడని.. డాన్స్ నేర్చుకోకపోయినా, తన స్వయంకృషితోనే అన్నింటినీ సాధించాడని తెలిపారు. ఉదయ్ కిరణ్ కెరీర్ ప్రారంభంలో చిత్రం సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వన్ మూవీ హీరో అనే విమర్శలు ఎదుర్కొన్నాడని .. కానీ తన తమ్ముడు మంచి కథ కోసం వేచి చూసి, నువ్వు నేను చిత్రంతో తిరిగి విజయాన్ని అందుకున్నాడని అన్నారు.
మనసంతా నువ్వే చిత్రం ఉదయ్ కెరీర్లో ఒక మైలురాయి లాంటిదని, ఇందులో “చెప్పవే ప్రేమ” పాట అతని మొదటి డ్యూయెట్ అని శ్రీదేవి వెల్లడించారు. ఈ పాట షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్లడం ఉదయ్ కిరణ్కు మొదటి విదేశీ పర్యటన అని, అప్పట్లో పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం తను హరిహర కళాభవన్ షూటింగ్కు వెళ్లి ఉదయ్ని కలిసిన జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు. తన అన్నయ్య కూడా వైద్య విద్యార్థిగా AFMC పూణేలో చదువుతున్నప్పుడు ప్రపంచంలోని అన్యాయాలను తట్టుకోలేక అదే విధంగా కన్నుమూశారని, ఆ సమయంలో ఉదయ్ కిరణ్కు కేవలం 11 సంవత్సరాలు మాత్రమేనని గుర్తుచేసుకున్నారు. తన తల్లి 2006లో మరణించిన తర్వాత, ఉదయ్ కిరణ్కు శ్రీదేవి మరింత దగ్గరయ్యానని.. ఉదయ్ మరణం తర్వాత హైదరాబాద్కు రావడం కూడా మానేశానని, నగరంలోని ప్రతి వీధిలో ఉదయ్ జ్ఞాపకాలు ఉండటమే దీనికి కారణమని ఆమె తెలిపారు.
ఉదయ్ కిరణ్ ఎప్పుడూ తన మనసులోని బాధలను, పరిశ్రమలోని ఇబ్బందులను కుటుంబంతో పంచుకునేవాడు కాదని, తమను సంతోషంగా చూడాలనే కోరుకునేవాడని శ్రీదేవి అన్నారు. అతను ఇంట్లో కూడా మనసంతా నువ్వే చిత్రంలో కనిపించినట్లే “బాయ్ నెక్స్ట్ డోర్” లా ఉండేవాడని, స్నేహపూర్వకంగా, ప్రేమగా అందరితో మెలిగేవాడని ఆమె వివరించారు. రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు అక్కకు బహుమతులు కొనివ్వడం, ముఖ్యంగా షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఫోర్ పేర్స్ అందమైన బ్యాంగిల్స్ను తెచ్చి ఇవ్వడం వంటి అతని ఆప్యాయతను శ్రీదేవి గుర్తు చేసుకున్నారు.మనసంతా నువ్వే రీ-రిలీజ్ను ఉదయ్ కిరణ్ చూడలేకపోవడం బాధాకరమని, అతను బతికి ఉంటే ఈ సందర్భాన్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునేవాడని శ్రీదేవి అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
